
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక అక్కడ ప్రజల జీవనం రోజుకో బాంబు, గంటకో హత్య అన్నట్టుగా మారిపోతున్నది. తాలిబన్లతో పాటు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తీవ్రవాదుల ఆగడాలకు అక్కడ అంతేలేకుండా పోతున్నది. తాజాగా క్రికెట్ లీగ్ మీద కూడా ముష్కరులు బాంబులతో దాడికి దిగారు. స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగానే ఆత్మాహుతి దాడితో స్టేడియంలోని ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు.
కాబూల్ నగరంలోని అలోకోజాయ్ కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ సందర్భంగా ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. భారత్ లో ఐపీఎల్ మాదిరిగా అఫ్ఘాన్ లో కూడా ష్పగీజా క్రికెట్ లీగ్ భాగా ఫేమస్. ఈ లీగ్ ను లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు ఆత్మాహుతి దాడికి దిగారు.
ష్పగీజా క్రికెట్ టీ20 లీగ్లో భాగంగా పామిర్ జల్మీ, బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా స్టేడియంలో బాంబులు పేలాయి. అభిమానులుగా వచ్చిన ముష్కరులు.. పేలుళ్లకు దిగారు. దీంతో అక్కడున్నవాళ్లంతా హుటాహుటిన బయటకు పరుగెత్తుకెళ్లారు. ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తున్నా క్షతగాత్రుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని సమాచారం.
ఆటలో ఈ ట్విస్ట్ ను ఊహించని నిర్వాహకులు.. ఆటగాళ్లకు సమీపంలో ఉన్న బంకర్ లోకి తీసుకెళ్లారు. తాజా నివేదికల ప్రకారం ఈ ఘటన జరిగినప్పుడు ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా స్టేడియంలో ఉన్నట్టు సమాచారం. ఇదిలాఉండగా ఈ దాడిని కాబూల్ పోలీసు ప్రధాన కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది.