వైన్ షాప్ గోడకు రంధ్రం చేసి లక్ష రూపాయల మద్యం చోరీ

By telugu teamFirst Published Apr 4, 2020, 3:22 PM IST
Highlights

హైదరాబాదులో మందబాబులు మద్యం చోరీకి పాల్పడ్డారు. హైదరాబాదులోని గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల వైన్ షాపు వెనక గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించి మద్యం ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మందుబాబులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. వైన్ షాపులు, పబ్స్, బార్లు అన్నీ మూత పడడంతో మద్యం దొరకడం లేదు. ఈ స్థితిలో హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం దొంగతనం జరిగింది. 

శ్రీవెంకటేశ్వర వైన్ షాపులో దొంగలు లూటీకి పాల్పడ్డారు. దుకాణం వెనక నుంచి రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి లక్ష రూపాయల విలువైన మద్యం చోరీ చేసి పారిపోయారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరా టీవీల్లో రికార్డయ్యాయి. ఆ రికార్డుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. మందుబాబులకు ఏ మాత్రం ఊరట కలిగించడం లేదు. దీంతో మందుబాబులు పలువురు పిచ్చెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మతిస్థిమితం తప్పి వ్యవహరిస్తున్నారు. దీంతో హైదరాబాదులోని ఎర్రగడ్డలో గల మానసిక చికిత్సాలయం కిటకిటలాడుతోంది. శుక్రవారం ఒక్క రోజే 112 మంది రోగులు వచ్చారు. 

బంధువులు, కుటుంబ సభ్యులు మద్యం దొరక్క పిచ్చిగా వ్యవహరిస్తున్న తమవారిని ఆస్పత్రికి తీసుకుని వస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొద్ది మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తాజాగా హైదరాబాదులో మందబాబులు చోరీకి పాల్పడ్డారు.

click me!