Telangana Liberation Day 2023 : మాజీ ప్రధాని నెహ్రూపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

By Mahesh RajamoniFirst Published Sep 17, 2023, 10:21 AM IST
Highlights

Hyderabad: తెలంగాణ విమోచన దినోత్సవం (సెప్టెంబర్ 17)లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. 17 సెప్టెంబరు 1948న అప్పటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైంది. గత ఏడాది హైదరాబాద్ లో కేంద్రం నిర్వహించిన విమోచన దినోత్సవ వేడుకల్లో కూడా అమిత్ షా పాల్గొన్నారు. విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో హోంమంత్రి జాతీయ జెండాను ఎగురవేసి పరేడ్ ను పరిశీలించారు.
 

Telangana Liberation Day 2023: తెలంగాణ రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టి నేటి సెప్టెంబర్ 17కు 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని వివిధ పార్టీలు వివిధ పేర్ల‌తో నేడు వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ 'తెలంగాణ సమైక్యతా దినం' పేరిట ఉత్సవాలు చేపట్టగా, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు తెలంగాణ విమోచ‌న దినం పేరుతో వేడుక‌లు నిర్వహిస్తోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ సీనియ‌ర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భార‌త మాజీ ప్ర‌ధాని జవహర్ లాల్ నెహ్రూ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

భార‌త యూనియ‌న్ లో అప్ప‌టి నిజాం పాల‌న‌లో ఉన్న హైద‌రాబాద్ సంస్థానం విలీనం అంశంలో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పాత్ర ఏమాత్రం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానానికి చెందిన ప్రజలకు విముక్తి లభించింద‌ని వ్యాఖ్యానించారు. రజాకార్లు, నిజాం ప్రభుత్వ సేనల హత్యలు, దౌర్జన్యాలను అంతమొందించడానికి భారత సాయుధ దళాలను పంపాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయం తీసుకున్నార‌ని తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో అరాచకాలను అణచివేసేందుకు దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పెద్ద‌గా ఏం చేసిందిలేద‌ని అన్నారు.

తన తాత, కొండా వెంకట రంగారెడ్డి, ఆనాటి కాంగ్రెస్ నేతలు బూర్గుల రామకృష్ణారావు నెహ్రూను కలిసి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి వివరించినా నెహ్రూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఏజెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్న కేఎం మున్షీ రాసిన ఒక పుస్తకం ప్రకారం, నెహ్రూ చర్య తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఏదైనా చర్య హైదరాబాదులో మరో విభజన లాంటి పరిస్థితికి దారితీస్తుందని భయపడ్డారు. ఆ సమయంలోనే రంగారెడ్డి, బూర్గుల వెళ్లి పటేల్ ను కలిశారనీ, ఆయన నిర్ణయం తీసుకుని ఆపరేషన్ పోలోను ప్రారంభించారని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఆ తర్వాత నెహ్రూ ఈ ఇద్దరు కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారనీ, పటేల్ చర్యకు మద్దతిస్తున్న మరికొందరు తన వెనుకకు వెళ్లి పటేల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని విశ్వేశ్వర్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి విలేకరుల సమావేశంలో చెప్పారు. "ఇది జరిగిన చరిత్ర. నిజాం, రజాకార్ల బారి నుంచి హైదరాబాద్ ను విడిపించేందుకు నెహ్రూ ఎలాంటి చర్యలు తీసుకోదలచుకోలేదు. స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ తోనే హైద‌రాబాద్ సంస్థానంలోని ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్రం ల‌భించింద‌ని" బీజేపీ నేత‌లు నొక్కిచెప్పారు.

click me!