కృష్ణా జిల్లాలో కరోనా కలకలం: 28కి చేరిన కేసుల సంఖ్య, బెజవాడలో అత్యధికం

By Siva KodatiFirst Published Apr 6, 2020, 2:29 PM IST
Highlights

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 28కి చేరగా, వీటిలో అత్యథికంగా విజయవాడ నగరంలో 23 కేసులు నమోదయ్యాయి

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 28కి చేరగా, వీటిలో అత్యథికంగా విజయవాడ నగరంలో 23 కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ 19 బాధితులకు ఐసోలేషన్ వార్డులో అధికారులు, వైద్య సిబ్బంది చికిత్స అందిస్తుననారు. వైరస్ మిగిలిన వారికి సోకకుండా, కోవిడ్ బాధితుల నివాస ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

నగరంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాస ప్రాంతాలుగా ఎనిమిది చోట్ల రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు. అలాగే జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం‌లలో కంటోన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటు చేశారు.

Also Read:ఏపీపై కరోనా పంజా: 266కి చేరిన కేసులు, ముగ్గురి మృతి

దీనితో పాటు జిల్లా వ్యాప్తంగా వీధి వీధిలో పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 400 బెడ్స్‌తో స్టేట్ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు.

పిన్నమనేని సిద్ధార్థలో 132 బెడ్స్‌తో కృష్ణాజిల్లా కోవిడ్ సెంటర్, 16 నియోజకవర్గాల్లో 100 బెడ్లతో పదహారు క్వారంటైన్ సెంటర్లు.. వీటికి అదనంగా మూడు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

అలాగే నగరంలో ఉన్న మూడు అంబులెన్స్‌లకు అదనంగా మరో మూడు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చి విజయవాడలో ఉన్న వారి క్వారంటైన్‌ను  పరిశీలించేందుకు 100 మంది హౌస్ సర్జన్లు రంగంలోకి దిగారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: ఏపీలో ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు జగన్ ఆదేశం

క్వారంటైన్ కోసం బెడ్లు కేటాయించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు సైతం ముందుకు వస్తున్నాయి. విపత్కర పరిస్ధితుల్లో సహాయం చేసేందుకకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 266కి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 

click me!