మారటోరియం: క్రెడిట్ కార్డు హోల్డర్లకు రిజర్వ్ బ్యాంక్ చేదు వార్త

By narsimha lodeFirst Published Mar 27, 2020, 3:02 PM IST
Highlights

రోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 1.7లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన మరుసటి రోజే శుక్రవారం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయాలను ప్రకటించింది


ముంబై: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 1.7లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన మరుసటి రోజే శుక్రవారం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయాలను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లపై ముందస్తు కోతను విధించడంతోపాటు లాక్‌డౌన్ కష్టాల నుంచి బయటపడేందుకు రుణాలపై భారీ ఊరటనిచ్చింది.

అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల మినహాయింపునిచ్చింది. అంతేకాదు సదరు ఖాతాలను మొండి బాకీలుగా పరిగణించరాదని కూడా ఆయా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు  ఆదేశాలిచ్చింది.

సాధారణంగా రుణగ్రహీతలు 90 రోజులకు పైగా చెల్లింపులను చేయకపోతే బ్యాంక్ ఆ ఖాతాను మొండి బాకీగా పరిగణిస్తుంది. అయితే తాజా ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన తరువాత పలువురు వినియోగదారుల్లో  క్రెడిట్ కార్డు రుణాల పరిస్థితిపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది.

also read:యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ : రూ.5000 కోట్ల పెట్టుబడుల సేకరణకు నిర్ణయం

క్రెడిట్ కార్డు రుణాలు, లేదా బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని స్పష్టం చేసింది. ఆయా చెల్లింపులను నిబంధనల ప్రకారం వినియోగదారులు తప్పకుండా చెల్లించాలని తెలిపింది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లాంటివి మాత్రమే టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పింది. దీంతో ఈ కష్టకాలంలో ఊరట లభిస్తుందని ఆశించిన క్రెడిట్ కార్డు వినియోగదారులు ఉసూరుమన్నారు.

మరోవైపు ఆర్బీఐ తాజా నిర్ణయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆర్‌బీఐ కల్పించిన వెసులుబాట్లపై అటు మార్కెట్ వర్గాలు, ఇటు  విశ్లేషకులు కూడా సంతోషాన్ని ప్రకటించారు.
 

click me!