
మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అంటే చాలామందికి ఇష్టం. ఇంటి తోటలో లేదా డాబా మీద ఎక్కడ వీలైతే అక్కడ పెంచుతుంటారు. ఇలాంటి హాబీ సంపాదనకు మార్గం చూపిస్తే భలేగా ఉంటుంది కదూ! అలాంటిదే మహోగని చెట్టు. దాన్ని నాటి, 12 ఏళ్లపాటు సంరక్షిస్తే మీరు కోటీశ్వరులు అయిపోవడం ఖాయం. అయినా ఆ మొక్క ఖరీదు మరీ ఎక్కువేం కాదు. మామూలు మొక్కల ధర లాగే 15 నుంచి 25 రూపాయల మధ్యలోనే ఉంటుంది. మరీ ఎక్కువైతే 50 రూపాయలు ధర పలుకుతుంది.
ఎంత ధర?
అసలు ఆ ఆ చెట్టు కలప ధర ఎంత ఉంటుందో తెలుసా? ఆ కలప ఘనపు అడుగుకి రూ.2000 నుంచి 2200 రూపాయలు పలుకుతుంది. కానీ అమ్మేటప్పుడు ఒక నియమం పాటించాలి. చెట్టు నిటారుగా, పొడవుగా పెరగాలి. అప్పుడే మంచి ధర వస్తుంది. ఈ చెట్టు కలపే కాదు, ఆకులు, గింజలు కూడా చాలా విలువైనవి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, 120 మహోగని మొక్కలు నాటి, బాగా సంరక్షణ చేస్తే, 12 ఏళ్లలోనే కోటీశ్వరులు అయిపోవచ్చు. 6 ఏళ్లలోనే ఈ చెట్టు పూర్తిగా పెరుగుతుంది. మహోగని మొక్కలు నాటితే ఒక ప్రయోజనం ఉంది, అదేంటంటే ఆ చెట్ల మధ్యలో ఇతర పండ్ల చెట్లు కూడా నాటవచ్చు.
ఎలా పెంచాలి?
రైతులు ముందుగా మట్టిని పరీక్షించుకోవాలి. మట్టి pH విలువ 6-7 ఉండాలి. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు కనీసం 4-5 మీటర్ల దూరం ఉండాలి. చెట్టును ఒక అడుగు వెడల్పు గుంతలో నాటాలి. మొదట్లో జీవామృతం ఎరువు వేస్తే సరిపోతుంది. 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల పొటాష్ మొక్క నాటేటప్పుడు వేయాలి. జూలై నెల మహోగని మొక్కలు నాటడానికి మంచి సమయం.