
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా విశ్వమారి చూపుతున్న ప్రభావంపై మాటల్లో చెప్పలేమని పరపతి రేటింగ్ సంస్థ ‘క్రిసిల్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దెబ్బతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాలుగోసారి ఆర్థిక మాంద్యంలోకి పోతోందని తెలిపింది.
1958, 1966, 1980లలో దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఆర్థిక మాంద్యాల కంటే ఈసారి మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉంటుందని క్రిసిల్ హెచ్చరించింది. ఒకవేళ ఈ ప్రభావం నుంచి కోలుకున్నా, మూడేళ్ల వరకు కరోనాకు ముందున్న జీడీపీ వృద్ధి రేట్లు నమోదయ్యే అవకాశమూ లేదని స్పష్టం చేసింది.
1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మహా ఆర్థిక మాంద్యాన్ని చవిచూడడం ఇదే తొలిసారి. లాక్డౌన్ పుణ్యమా అని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 5 శాతం మేరకు పడిపోతుందని క్రిసిల్ అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని క్రిసిల్ పేర్కొన్నది. ఈ కాలంలో జీడీపీ మైనస్ 25 శాతం వరకు గండి పడుతుందని తెలిపింది. గత మూడు మాంద్యాలకు వరుణుడు కరుణించక వ్యవసాయం చతికిలపడితే, ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి కరోనా కారణం అవుతోందని తెలిపింది.
సాధారణ వర్షాలతో వరుణుడు సకాలంలో కరుణించే అవకాశం కనిపించడమే ప్రస్తుతం భారత్కు ప్రస్తుతం కనిపిస్తున్న పెద్ద సానుకూల అంశమని క్రిసిల్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఫిచ్ రేటింగ్స్ కూడా ఈ ఏడాది వృద్ధి మైనస్ 5 శాతంగా ఉంటుందని పేర్కొంది.
also read అమ్మ రాణాకపూర్: డిపాజిట్లతో అడ్డగోలు రుణాలు.. ఏళ్లుగా యెస్ బ్యాంక్ స్కాం
కరోనా విశ్వమారితో ఆర్థిక వ్యవస్థ నష్టాలు ముందుగా వేసిన అంచనాలను మించి పోయాయని క్రిసిల్ పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయేతర రంగాలైన విద్య, పర్యాటకం, రవాణా వంటి రంగాలు పూర్తిగా కుదేలైన విషయాన్ని గుర్తు చేసింది. ఈ రంగాలు ఇప్పట్లో కోలుకునే అవకాశమూ కనిపించడం లేదు. దీంతో ఈ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఆదాయాలు పడిపోవడం లేదా పెద్ద సంఖ్యలో రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
కరోనా విశ్వమారి దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు రూ.30.3 లక్షల కోట్ల మేర నష్టపోయిందని ఎస్బీఐ పరిశోధనా సంస్థ ఎకోరాప్ వెల్లడించింది. ఇది మొత్తం జీడీపీలో 13.5 శాతానికి సమానం.
దేశంలో 5 పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) నష్టం 50 శాతానికి చేరువలో ఉందని పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల నష్టం సుమారు రూ.11 లక్షల కోట్ల వరకు ఉందని తెలిపింది.
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ వంటి టాప్ 10 రాష్ట్రాల జీఎస్డీపీ నష్టం దాదాపు 75 శాతం వరకు ఉందని ఎస్బీఐ పరిశోధనా సంస్థ ఎకోరాప్ పేర్కొంది. మొత్తం నష్టంలో ఆరెంజ్, రెడ్ జోన్ల వాటా 90 శాతంగా ఉందని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కంటే ఈ నష్టం 43 శాతం అధికమని ఎస్బీఐ పరిశోధనా సంస్థ ఎకోరాప్ తెలిపింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏకంగా -6.8 శాతంగా ఉండొచ్చని ఎస్బీఐ అంచనా వేసింది.