బంగారం ధరలు సరికొత్త రికార్డు...తాజాగా10 గ్రాముల ధర ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Mar 7, 2020, 10:50 AM IST
Highlights

పసిడి పరుగులు ఆగనంటున్నది. తాజాగా పది గ్రాముల బంగారం ధర రూ.45,343గా శుక్రవారం నమోదైంది. హైదరాబాద్ నగరంలో తులం బంగారం ధర రూ.46 వేలకు చేరువైంది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుండటంతో మదుపర్లకు సురక్షిత మార్గంగా పసిడి, వెండి కనిపిస్తున్నాయి.

పసిడి పరుగులు కొనసాగుతున్నాయి. దేశంలో పసిడి ధరలు మరింత పెరిగాయి. శుక్రవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) ధర రూ.773 ఎగబాకి రూ.45,343కు చేరుకున్నది. హైదరాబాద్ నగరంలో రూ.45,990గా నమోదైంది. పుత్తడితోపాటు వెండి కూడా మిడిసిపడుతోంది.

కిలో వెండి రూ.192 పెరిగి రూ.48,180కి చేరింది. కరోనా ధాటికి ప్రపంచ ఎకానమీ మళ్లీ సంక్షోభంలోకి జారుకోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భద్రమైన పెట్టుబడి సాధనాలుగా పేరున్న బంగారం, వెండిలోకి మళ్లిస్తున్నారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. 

also read యెస్ బ్యాంక్...అంతా అస్తవ్యస్తం...రూ.3.28 లక్షల కోట్లు హాంఫట్..

తదనుగుణంగా దేశీయంగానూ బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి. రూపాయి విలువ పతనం ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. గురువారం మల్టీకమోడిటీ మార్కెట్లో రూ. 200 పెరిగిన బంగారం ధర శుక్రవారం ఏకంగా రూ.900 ఎగిసింది.

దీంతో 10 గ్రాముల పసిడి రూ.44,468.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తద్వారా ఎంసీఎక్స్‌లో పసిడి ధర అల్‌టైమ్‌ హై గరిష్టాన్ని నమోదు చేసింది. రెండు రోజులుగా పసిడి ధరలు రూ.1000కి పైగా పెరగడం విశేషం. 

తరువాత పసిడి టార్గెట్‌ రూ.45 వేలని, ఇక్కడ ఈ స్థాయిని నిలదొక్కుకోగలిగితే పసిడి పరుగు మరింత వేగం అందుకుంటుందని బులియన్‌ వర్తకులు భావిస్తున్నారు. అటు గ్లోబల్‌గా కూడా 1,700 డాలర్ల పైన స్థిరపడితే ఈ ర్యాలీ 1742 డాలర్ల వైపు పయనించే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ప్రతినిధి హరీష్  తెలిపారు. 

also read మీ డబ్బు ఎక్కడికి పోదు, భద్రంగా ఉంది : ఆర్థిక మంత్రి

బంగారం ఇకపై పటిష‍్టమేనని ఎస్‌ఎంసి గ్లోబల్ ఒక నోట్‌లో పేర్కొనడం గమనార్హం. గురువారం ఆసియా మార్కెట్లతోపాటు అమెరికా ఇండెక్స్‌లు 3 శాతం పడిపోవడంతో అంతర్జాతీయంగాను బంగారం ధర పెరిగింది. 

గ్లోబల్ మార్కెట్లలో, మునుపటి సెషన్లో రెండు శాతం పైగా పెరగగా శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. స్పాట్ బంగారం ఔన్సుకు 1,669.13 డాలర్ల వద్ద స్వల్పంగా లాభపడుతోంది. వెండి 0.5 శాతం క్షీణించి ఔన్స్‌ 17.33 డాలర్లకు, ప్లాటినం 0.7శాతం నష్టంతో 858.61 డాలర్లకు చేరుకుంది.

click me!