
ఉక్రెయిన్పై రష్యా దాడులు.. ముడి చమురు మంటలకు ఆజ్యం పోశాయి. క్రూడాయిల్ ధరలు ఒకేసారి ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. బ్యారెల్ రేటు 104 డాలర్లపైకి చేరింది. 2014 ఆగస్టు 14 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ రేటు 150 డాలర్లకు కూడా వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం 2020 ఏప్రిల్–డిసెంబర్ మధ్య ముడిచమురు రేటు బ్యారెల్కు 39.3 డాలర్లుగా ఉండేది. మరోవైపు, రష్యా నుంచి భారత్కు పెద్దగా క్రూడాయిల్ సరఫరాలు లేకపోవడం వల్ల ఈ వివాదం మరింతగా ముదిరినా మనకు సరఫరా పరంగా పెద్ద సమస్యలు ఉండవని విశ్లేషకులు తెలిపారు.
అంతర్జాతీయంగా రేట్లు భారీగా ఎగిసినా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు .. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను కట్టడి చేస్తుండటంతో ప్రస్తుతానికైతే వినియోగదారులపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒక దశలో రేట్లు పెరగక తప్పదు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా సరఫరా వ్యవస్థలేమీ దెబ్బతినలేదు. మనకు సరఫరా చేసే దేశాలపై ప్రభావమేమీ లేదు. ఉద్రిక్తతలు మరింత ఉధృతమైనా ఈ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. అయితే.. ప్రస్తుతానికి రిటైల్ ధరలను అదుపులోనే ఉంచినప్పటికీ.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగితే ఏదో ఒక దశలో వాటిని పెంచక తప్పకపోవచ్చని మార్కెట్ నిపుణులు వివరించారు.
సరఫరాపరమైన సమస్యలు లేకపోయినప్పటికీ.. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్త పరిణామాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగిపోతే ఆ ప్రభావం దేశీయంగా గట్టిగానే కనిపించనుంది. చమురు రిటైల్ రేట్లు పెరిగి .. తత్ఫలితంగా మిగతా ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతాయనే భయాలు పెరుగుతున్నాయి. దేశీయంగా ఇంధనాల ధరలు .. అంతర్జాతీయ ఆయిల్ రేట్లకు అనుగుణంగా ప్రతి రోజూ మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా ధర పెరుగుతున్నా.. వివిధ కారణాల రీత్యా రికార్డు స్థాయిలో దేశీయంగా దాదాపు 113 రోజులుగా దేశీయంగా మాత్రం రిటైల్ రేట్లు మారలేదు. బ్యారెల్ 82–83 డాలర్ల రేటు స్థాయిలోనే కొనసాగుతున్నాయి.
గతంలో 2018 మే నెలలో కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంధన రిటైల్ సంస్థలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు బ్యారెల్కు 5 డాలర్ల పైగా పెరిగినా.. 19 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచలేదు. ఎన్నికలు అలా ముగిశాయో లేదో ప్రతిరోజూ పెంచుకుంటూ పోయాయి. 16 రోజుల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 3.8, డీజిల్ రేటు రూ. 3.38 మేర పెరిగిపోయింది. 2020లో పెట్రోల్పై లీటరుకు రూ. 10, డీజిల్పై రూ. 13 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో ఇంధనాల రేట్లు పెరిగిపోయాయి. ప్రజా వ్యతిరేకత భయంతో మధ్యలో ఒకసారి సుంకాన్ని కొంత తగ్గించినప్పటికీ దేశీయంగా రేటు మాత్రం భారీ స్థాయిలోనే కొనసాగుతోంది.
చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్.. ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. దేశీయంగా క్రూడాయిల్ లభ్యత నామమాత్రమే కావడం వల్ల ఏకంగా 85 శాతం ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దిగుమతి చేసుకున్న ముడిచమురును పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఉత్పత్తుల కింద మారుస్తారు. భారత్ దిగుమతి చేసుకునే ఆయిల్లో 63.1 శాతం భాగం సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి వస్తోంది. ఆ తర్వాత ఆఫ్రికా వాటా 14 శాతం, మరో 13.2 శాతం వాటా ఉత్తర అమెరికా నుంచి ఉంటోంది. భారత్ కొనుగోలు చేసే ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ రేటు నవంబర్లో 80.64 డాలర్లుగా ఉండగా, డిసెంబర్లో 73.30 డాలర్లకు తగ్గింది. జనవరిలో 84.87 డాలర్లకు, అటుపైన ఫిబ్రవరి 16 నాటికి 94.68 డాలర్లకు ఎగిసింది.
భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా ఆయిల్ పరిమాణం కేవలం ఒక్క శాతం స్థాయిలో ఉంటుంది. 2021లో ఇది 43,400 బ్యారెల్గా ఉంది. అలాగే, గతేడాది రష్యా నుంచి భారత్ 1.8 మిలియన్ టన్నుల బొగ్గు కొనుగోలు చేసింది. ఇది మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం మాత్రమే. ఇవి కాకుండా ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ధ్రువీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ని భారత్ దిగుమతి చేసుకుంటోంది.
టోకు ధరల సూచీలో క్రూడాయిల్ సంబంధిత ఉత్పత్తుల వాటా తొమ్మిది శాతం పైగా ఉంటుంది. చమురు రేట్లు 10 శాతం మేర పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 0.9 శాతం మేర పెరగవచ్చని అంచనా. ఇంధనాల రేట్లు పెరగడం వల్ల రవాణా వ్యయాలు పెరుగుతాయి. ఫలితంగా కూరగాయలు మొదలుకుని తయారీ ఉత్పత్తుల వరకూ అన్నింటి ధరలూ పెరుగుతాయి. క్రూడ్ సంబంధిత ముడిపదార్థాలు వాడే పెయింట్లు, టైర్లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, కేబుల్స్ మొదలైన వాటి ధరలూ ఎగుస్తాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే, దిగుమతి భారమై, దేశీయంగా ద్రవ్యోల్భణం పెరుగుతుంది. చమురు వినియోగంలో భారత్ 80 శాతం వరకు దిగుమతుల పైనే ఆధారపడి ఉంది. అలాగే, మొత్తం దిగుమతుల్లో చమురు దిగుమతులు 25 శాతంగా ఉన్నాయి. చమురు ధరలు పెరిగితే, మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఈ ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతుంది. అప్పుడు ద్రవ్యోల్భణం పెరుగుతుంది.