ఆటో ఎక్స్‌పోకు డజనుకుపైగా కంపెనీలు డుమ్మా...కారణం ?

By Sandra Ashok KumarFirst Published Dec 21, 2019, 1:45 PM IST
Highlights

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఆటో ఎక్స్‌పో పలు నిరాశజనక ఫలితాలు మిగిల్చేలా కనిపిస్తోంది. పలు కంపెనీలు డుమ్మాకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటో  పరిశ్రమ మందగమనం, డజనుకుపైగా కంపెనీలు డుమ్మా కొడతాయని తెలుస్తోంది. అయితే  ఎక్స్‌పోతో సంక్షోభం నుంచి గటెక్కవచ్చునని సియామ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.
 

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో దీర్ఘకాలిక కొనసాగనున్న మందగమనం రానున్న ఆటో ఎక్స్‌పోపై గణనీయ ప్రభావం చూపనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి తొలి వారం అట్టహాసంగా జరగనున్న ఈ ఎక్స్‌పోలో దేశీయ కంపెనీలతోపాటు డజనుకుపైగా కంపెనీలు పాలు పంచుకోవడం లేదు. 

ఆటో ఎక్స్‌పో 2020 లో పాల్గొనకపోడానికి ఆయా కంపెనీలకు వారి వారి  సొంత కారణాలు ఉన్నాయి. కానీ ఆటో ఎక్స్ పో విజయవంతం అవుతుందని పరిశ్రమల బాడీ సియామ్‌ ఆశాభావం వ‍్యక్తం చేస్తోంది.ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీదారు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, టీవీఎస్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్, ఆడి, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, నిస్సాన్, అశోక్ లేలాండ్ తదితర సంస్థలతోపాటు సహా డజనుకు పైగా వాహన తయారీ సంస్థలు ఆటోఎక్స్‌పో-2020 కు దూరంగా ఉండనున్నాయి. 

also read ఇండియాలో..క్యూ కడుతున్న చైనా కార్ల కంపెనీలు...ఎందుకంటే ?

వీటితోపాటు  రాయల్ ఎన్‌ఫీల్డ్, హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్ మోటార్‌ సైకిల్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారత్ బెంజ్, వోల్వో కార్స్ ఇండియా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఈవెంట్‌కు గతంలో కూడా  డుమ్మాకొట్టాయి. ఈ లోటును తొలిసారిగా ఈ ఎక్స్‌పోలో పాలుపంచుకుంటున్నఎంజీ మోటార్, గ్రేట్ హవల్ మోటార్స్‌తో పాటు ఫోర్స్ మోటార్స్, అథర్ ఎనర్జీతోపాటు అనేక ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌ భర్తీ చేయనున్నాయి. 

ఆటో ఎక్స్‌పోతో ఆటోమొబైల్‌ రంగం మందగమనం నుంచి గట్టెక్కుతుందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) ఆశాభావం వ్యక్తం చేసింది. దేశీయంగా కొన్ని కంపెనీలు పాల్గొనకపోవచ్చు, దీనికి వారి సొంత కారణాలు ఉండవచ్చు కానీ కొత్తగా వచ్చిన వారి ప్రభావం వుంటుందని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఆటో ఎక్స్ పోల సంఖ్య కూడా తగ్గుతోందనీ, ఫ్రాంక్‌ఫర్ట్, టోక్యో వంటి నగరాల్లో జరిగిన ఎక్స్ పోల్లో కూడా కంపెనీల భాగస్వామ్యం తగ్గిందనీ, దీంతో పాటు మందగమనం తదితర కారణాలను పరిగణనలోకి తీసుకొని ఒకదశలో ఈ ఎక్స్ పోను ఒక ఏడాది వాయిదా వేయాలని కూడా ఆలోచించామనీ సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా చెప్పారు. 

2020 ఏప్రిల్ నుంచి అమలుకానున్న బీఎస్‌-6 కొత్త ఉద్గార నిబంధనలు కూడా​ ప్రభావం చూపనున్నాయని సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 12 వరకూ జరగనున్న ఈ ఎక్స్‌పో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పోలలో ఒకటిగా నిలవనుందని అంచనా. 

also read మారుతి, ఫోర్డ్, రెనాల్ట్ కార్లకు పోటీగా హ్యుండాయ్ కొత్త కారు...

దేశ రాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోఉన్న గ్రేటర్ నోయిడా వద్ద 2.35 లక్షల చదరపు మీటర్ల స్థలంతో 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తారు. సుమారు 60కి పైగా కొత్త వాహనాలు విడుదల అవుతాయని, రోజుకు లక్ష మంది సందర్శకులు రావచ్చని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగాటో సేన్ భావిస్తున్నారు. 

కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు వరుసగా తొమ్మిది నెలల్లో క్షీణతను నమోదు చేశాయి. దీంతో మారుతి సుజుకి, ఆశోక్‌ లేలాండ్‌ కంపెనీలు ఉత్పత్తిలో కోత పెట్టాయి. తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేసాయి. అలాగే వేల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. 

ఆటోమొబైల్ రంగంలో మందగమనం ప్రభావం ఆటో పరిశ్రమల విడిభాగాల కంపెనీలపై కూడా తీవ్రంగా పడింది. దీంతో లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు పరిశ్రమల వాల్యూమ్ దాదాపు 16% క్షీణించింది. ప్రయాణికుల వాహనాలు 18%, వాణిజ్య వాహనాలు 22%, ద్విచక్ర వాహనాల 15.7% క్షీణించడం ఆటో పరిశ్రమలో సంక్షోభానికి ప్రధాన కారణం.
 

click me!