ప్రమాదం, నరాలపై పనిచేస్తుంది: జాహిద్ ఖాన్ కామెంట్స్

By telugu teamFirst Published May 7, 2020, 10:46 AM IST
Highlights

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన గ్యాస్ అత్యంత ప్రమాదకరమైందని జహీద్ ఖాన్ అంటున్నారు. అది మనుషుల నరాలపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ చాలా ప్రమాదకరమైందని మంగళగిరి పదవ ఎన్డీఆర్ కమాండెంట్ జాహిద్ ఖాన్ అన్నారు. ఇది మనుషులు నరాల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. తలనొప్పి, వాంతులు, వినికిడి లోపం, తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. 

లీక్ అయిన ఈ గ్యాసు ఎక్కువ కాలం  ఆ ప్రాంతంలో ఆవరించి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ కే కాకుండా ఇతర ఆస్పత్రులకు వందల సంఖ్యలో  బాధితులను పోలీసు సిబ్బంది తరలించారు. ప్రమాద తీవ్రత ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కరోనా కోసం వాడుతున్న మాస్క్ లను  ఈ సమయంలో వాడటం ఎంతో అవసరమని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఆ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఆ విషవాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది. బుధవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకైంది.

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. మూగజీవులు కూడా దాని తీవ్రతకు గురై పడిపోతున్నాయి. మనుషులు అక్కడికక్కడే కుప్ప కూలిపోతున్న దృశ్యాలను కూడా కనిపిస్తున్నాయి.

విషయవాయువుతో చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలో, కడుపులో వికారం పుట్టడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లు వదిలేసి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీశారు. ఐదు గ్రామాల ప్రజలను అధికారులు అధికారులు తరలిస్తున్నారు.

తీవ్ర అస్వస్థకు గురైనవారిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తన్నారు. అస్వస్థకు గురైనవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగరం పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో విషవాయులు లీలకైనట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు.  

click me!