విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన... వారి నిర్లక్ష్యం వల్లే: పవన్ కల్యాణ్ ఆగ్రహం

Arun Kumar P   | Asianet News
Published : May 07, 2020, 10:31 AM ISTUpdated : May 07, 2020, 10:34 AM IST
విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన... వారి నిర్లక్ష్యం వల్లే: పవన్ కల్యాణ్ ఆగ్రహం

సారాంశం

విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. 

విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులను చేసింది. ఈ దుర్ఘటలనలో ఇప్పటికే 8 మంది మృత్యువాతపడగా వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యీరు. ఈ ప్రమాదంపై స్పందించిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

తీవ్ర అస్వస్థతకు గురయిన వారికి  మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతిత్వరగా వారంతా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని పవన్ కోరారు. 

విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని... ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలని సూచించారు. పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని... వారి ఇబ్బందులను తొలగించి విశాఖ చుట్టూ స్వచ్చమైన వాతావరణం వుండేలా చూడాలన్నారు. 

కాలుష్య కారక పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ విజ్ఞప్తి చేశారు. వారు స్పందించకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకొంటున్నాయన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలన్నారు.  అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 

ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని జనసేన పార్టీ నాయకులకు సూచించినట్లు తెలిపారు. ఆ నివేదిక ఆదారంగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని పవన్ వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu