ఫలించిన వైసీపీ ఎంపీల కృషి.. పోలవరం సవరించిన అంచనాలకు జల్‌శక్తి శాఖ అంగీకారం

By Siva KodatiFirst Published Jul 28, 2021, 9:08 PM IST
Highlights

కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను వైసీపీ ఎంపీలు కలిశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలని, ఎటువంటి షరతులు లేకుండా నిధులు రీయింబర్స్‌మెంట్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వారు మీడియాకు తెలిపారు.


కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను వైసీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. అదే విధంగా... నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. భేటీ అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలని, ఎటువంటి షరతులు లేకుండా నిధులు రీయింబర్స్‌మెంట్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Also Read:డిజైన్లు మార్చినా అదనపు నిధులివ్వలేం: పోలవరంపై కేంద్రం మెలిక 

పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడులను క్లియర్ చేయడంపై సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరామని.. కమిటీ సూచించిన మేరకు రూ.47,725 కోట్లు ఆమోదిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక బిల్లుల విషయంలో కాలయాపన లేకుండా ఎస్క్రో ఖాతా తెరవాలని అడిగామని.. అయితే అది సాధ్యం కాదని, వారం పదిరోజుల్లో రీయింబర్స్‌ చేస్తామన్నారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ.1920 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని షెకావత్ చెప్పారని వెల్లడించారు. రూ.47,725 కోట్లు కేబినెట్‌ ద్వారా ఆమోదించేందుకు సిద్ధమని కేంద్ర మంత్రి తెలిపినట్లుగా విజయసాయి చెప్పారు.

click me!