
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి పదవి దక్కుతోందో లేదా తెలియదు కానీ... జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను మించిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు.
తనకు అనుకూలమైన మీడియాతో చంద్రబాబునాయుడు ప్రధాన మంత్రి పదవి రేసులో ఉన్నాడని కథనాలు రాయించుకొంటున్నాడని ఆయన విమర్శించారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీకి కనీసం 30 అసెంబ్లీ స్థానాలు కూడ దక్కవన్నారు.
చంద్రబాబుకు ప్రధానమంత్రి పదవి దక్కుతోందో లేదో తెలియదు కానీ.... జైలుకు మాత్రం వెళ్తారని ఆయనతీవ్ర వ్యాఖ్యలే చేశారు. మరో వైపు బాబు నిర్వహించే సమీక్ష సమావేశాలకు ఆ పార్టీ నేతలు హాజరుకాకపోవడంపై కూడ ఆయన సెటైర్లు వేశారు.