
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. ఢిల్లీలోని గవర్నర్ నివాసానికి వెళ్లిన రఘురామ పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను అబ్దుల్ నజీర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన బిశ్వ భూషణ్ హరిచందన్ను ఛత్తీస్గడ్ గవర్నర్గా బదిలీ చేశారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ నజీర్ను ఏపీకి గవర్నర్గా నియమించారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్ అనేక చారిత్రక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో ఉన్నారు. త్రిపుల్ తలాఖ్, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం కేసు, పెద్ద నోట్ల రద్దు కేసులను విచారించారు. అయోధ్య తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ సభ్యులు కావడం గమనార్హం.
ALso REad: అయోధ్య తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు మాజీ జడ్జీకి గవర్నర్ పోస్ట్.. ఏపీ గవర్నర్గా జస్టిస్ ఎస్ఏ నజీర్
భారత న్యాయ వ్యవస్థలో లింగ సమానత్వం ఉన్నదని తాను అంటే.. వాస్తవానికి దూరంగా మాట్లాడినట్టే అని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తన ఫేర్వెల్ ఈవెంట్లో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నదని అన్నారు. అభివృద్ధి కోసం మహిళా సాధికారతను మించిన పరికరం మరేదీ లేదని కోఫీ అన్నన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ తెలిపారు.
ఫేర్వెల్ ఫంక్షన్లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ మాట్లాడుతూ అయోధ్య వివాదం కేసు తీర్పు వెలువరించిన వారిలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారని అన్నారు. వివాదాస్పదమైన అయోధ్య భూమి వివాద కేసు విచారించిన ధర్మాసనంలో ఏకైక ముస్లిం న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ అని వివరించారు. ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిందని, ఇది జస్టిస్ ఎస్ఏ నజీర్కు లౌకికతత్వంపై ఉన్న కమిట్మెంట్ను, న్యాయవ్యవస్థకు సేవ చేయాలని ఆరాటాన్ని వెల్లడిస్తుందని తెలిపారు.