వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్... కండీషన్స్ అప్లయ్

By Siva KodatiFirst Published Aug 22, 2022, 5:08 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానం మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రాజమండ్రిలోని ఎస్సీ,ఎస్టీ కోర్ట్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానం మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రాజమండ్రిలోని ఎస్సీ,ఎస్టీ కోర్ట్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నిన్న అనారోగ్యం కారణంగా అనంతబాబు తల్లి మంగారత్నం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఎల్లవరం గ్రామంలో తల్లి అంత్యక్రియలకు హాజరుకానున్నారు అనంతబాబు. రూ.25 వేలు, ఇద్దరు పూచీకత్తుపై కోర్ట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 

అయితే ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ కండిషన్స్ పెట్టింది కోర్ట్. 25 మధ్యాహ్నం 2 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు రాకూడదని, అనంతబాబుతో అనునిత్యం పోలీసులు వుండాలని న్యాయస్థానం సూచించింది. అలాగే కేసు విషయంపై ఎక్కడా ప్రస్తావించకూడదని కోర్ట్ ఆదేశించింది. అంత్యక్రియలకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించింది. 

ఇకపోతే.. ఈ ఏడాది మే 20వ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన సుబ్రమణ్యం హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఎమ్మెల్సీ అనంతబాబు కారణమని పోలీసులు తేల్చారు.  సుబ్రమణ్యాన్ని పద్దతి మార్చుకోవాలని మందలించే క్రమంలో  చేయి చేసకోవడంతో అతను కింద పడి తలకు గాయం కావడంతో మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసులో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు.

ఈ కేసులో అరెస్టైన అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ మంజూరు చేయాలని ఆయన గతంలో కోర్టుల్లో బెయిల్ పిటిసన్లు దాఖలు చేశారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు కొట్టివేశాయి. ఇదిలా ఉంటే  ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. 90 రోజుల్లోపుగా చార్జీషీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. 

మరోవైపు.. డ్రైవర్ సుబ్రమణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.  వైద్య ఆరోగ్య శాఖలో అపర్ణకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.ఈ మేరకు కలెక్టర్ కృతికా శుక్లా ఈ ఏడాది జూన్ చివర్లో ఉత్తర్వు పత్రాలను అందించారు. 

click me!