
ఆంధ్రప్రదేశ్లో వంగవీటి రంగా వర్థంతి వేళ రాజకీయాలు వేడెక్కాయి. విశాఖలో రంగా వర్దంతి సందర్భంగా నిర్వహించనున్న కాపునాడు సభ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతుంది. అయితే మరికొన్ని గంటల్లో ఈ సభ ప్రారంభం కానుండగా.. ఈ సమావేశానికి ఏ పార్టీల నేతలు హాజరవుతారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ నేతలు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కావద్దని వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం.
వంగవీటి రంగా వర్దంతి సందర్భంగా సభ ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రంగా- రాధా రాయల్ అసోసియేషన్ మద్దతుతో విశాఖలో ఈ సభ నిర్వహిస్తున్నారు. రంగాను గుర్తుచేసుకోవడానికేనని చెబుతున్నప్పటికీ.. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాపులు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఈ సభ వేదికగా మాట్లాడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అలాగే రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల అంశం కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ సభకు సంబంధించి అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపినట్టుగా నిర్వహకులు చెబుతున్నారు.
అయితే ఈ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. స్టేజీ మీద వైసీపీ నేతలు ఉన్న సమయంలో జనసేనకు చెందినవారు నినాదాలు చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని కారణంతోనే వైసీపీ అధిష్టానం తమ పార్టీ నేతలకు ఆ సభకు దూరంగా ఉండాలని ఆదేశించిందనే ప్రచారం సాగుతుంది. మరోవైపు టీడీపీ నేతలు ఈ సభకు సమావేశానికి హాజరవుతారా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాపునాడు సభలో ఏం జరుగబోతుంది?, ఏ పార్టీల నాయకులు హాజరవుతారు? అనేది ఉత్కంఠగా మారింది.