ఓటర్ల జాబితాలో అవకతవకలు .. దొంగల పార్టీ అధికారంలోకి వస్తే అరాచకమే : టీడీపీపై సజ్జల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 21, 2023, 3:58 PM IST
Highlights

ఓటర్ల జాబితా విషయంలో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దొంగల పార్టీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయోనని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు ఆలోచనలు ఎంత వికృతమైనవో.. దీని ద్వారా తెలుస్తుందన్నారు. 

ఓటర్ల జాబితా విషయంలో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ ఐడీ కార్డును తీసుకుని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రజల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని.. లెక్క వేసి టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోతందని సజ్జల ఆరోపించారు. 

అంతర్జాతీయ దొంగల ముఠాకు ఆ పార్టీ ఏమాత్రం తీసిపొదని.. ఏపీ ప్రజలు అప్రమత్తంగా వుండాలని రామకృష్ణారెడ్డి సూచించారు. రాతపూర్వకంగా ఇచ్చేది మేనిఫెస్టో అని.. మరి, దీనిని ఏమంటారు అని ఆయన ప్రశ్నించారు. సేవామిత్ర పేరుతో అన్ని వివరాలు సేకరించారని.. ఈ డేటాతో టీడీపీ బ్లాక్ మెయిల్ చేయొచ్చునని, ఏమైనా చేయొచ్చునని సజ్జల హెచ్చరించారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్స్ టీడీపీకి బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. దొంగల పార్టీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయోనని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు ఆలోచనలు ఎంత వికృతమైనవో.. దీని ద్వారా తెలుస్తుందన్నారు. 

ALso Read: Chandrababu Bail : ఢిల్లీకి ఏపీ సీఐడీ లీగల్ టీమ్... చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకోర్టులో సవాల్

ఇంత డబ్బులు వస్తాయని చెబుతున్నా వీళ్లను ఏ చట్టం ప్రకారం శిక్షించాలని సజ్జల ప్రశ్నించారు. సిస్టమ్‌లో వైరస్‌లా చొరబడి డేటా అంతా సేకరించారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు వైసీపీకి అనుకూలంగా వుండేవారి ఓట్లు తీసేయించారని ఆయన ఆరోపించారు. ఐదు కోట్ల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని.. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతూ నిలువు దోపిడీకి ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషికి ఏవైతే ఉండకూడదో అన్ని చంద్రబాబుకు ఉన్నాయన్నారు. అధికారంలోకి రావడానికి ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

click me!