ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్లో అన్ని వర్గాలకు ప్రాథాన్యత వుంటుందన్నారు.
కొత్త జిల్లాల (new districts) కసరత్తు పూర్తయ్యిందన్నారు వైసీపీ (ysrcp) ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) . దీనిపై ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్ర్మక ఘట్టమని.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని రామకృష్ణారెడ్డి అన్నారు. పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకుని జిల్లాల విభజన చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందని ఆయన చెప్పారు.
అమరావతి (amaravathi) నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని సజ్జల వెల్లడించారు. డెడ్లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కానీ ఆదేశాలు కాబట్టి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారని సజ్జల అన్నారు. చిన్న చిన్న మార్పులతోనే జిల్లాల తుది నోటిఫికేషన్ వస్తుందని సజ్జల పేర్కొన్నారు. 90 శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు అనుగుణంగానే కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సజ్జల వెల్లడించారు.
మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ (ys jagan) స్వయంగా చూస్తున్నారని.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ ఉంటుందన్నారు. సోషల్ జస్టిస్కు అనుగుణంగా జగన్ మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఒక ప్రాంత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా ? అని ప్రశ్నించారు. ఎకరాకు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని సీఎం వివరించడం జరిగిందని గుర్తు చేశారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం ఏంటీ అన్నారు.
ఇకపోతే.. ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ (ap planning department) కార్యదర్శి విజయ్ కుమార్ (vijay kumar) శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రెండ్రోజుల్లో తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఏప్రిల్ 4న సీఎం జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తారని విజయ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొత్త జిల్లాల జాబితాను కేంద్ర ప్రణాళిక శాఖకు పంపుతామన్నారు. పూర్తి శాస్త్రీయ విధానంలో, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల పునర్ విభజన చేపట్టినట్టు విజయ్ కుమార్ వివరించారు. జిల్లాల విభజనపై ప్రజల నుంచి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు రాగా, 284 అంశాలపై విజ్ఞప్తులు అందాయని ఆయన తెలిపారు. అయితే సీఎం జగన్ 90 శాతం అంశాలపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారని విజయ్ కుమార్ పేర్కొన్నారు.