YS Vivekananda Reddy murder case: దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ

By narsimha lodeFirst Published Nov 17, 2021, 2:51 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని  అరెస్ట్ చేశారు.  ఈ కేసులో వివేకా వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐకి కీలక సమాచారం ఇచ్చాడు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు.

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ బుధవారం నాడు అరెస్ట్ చేసింది. హైద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి  సీబీఐకి అఫ్రూవర్ గా మారి కీలక సమాచారాన్ని ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.  

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ హత్య చోటు చేసుకొంది.ఈ హత్య సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. చంద్రబాబునాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన  వైసీపీ సర్కార్ కూడా సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం వైఎస్ ys jaganజగన్ బాబాయ్, మాజీ మంత్రి ys vivekanada reddy murder case పై సీబీఐ  వంద రోజులుగా విరామం లేకుండా విచారణ చేస్తోంది.ఈ విచారణలో కీలక విషయాలను సీబీఐ సేకరించింది. వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి కీలక సమాచారాన్ని సీబీఐకి ఇచ్చాడు.

also read:YS Viveka Case: వివేకా హత్య కేసులో సీఎం జగన్‌నూ సీబీఐ విచారించాలి: టీడీపీ నేత పట్టాభి

వివేకానందరెడ్డి హత్యపై ఈ ఏడాది ఆగస్ట్ 30న దస్తగిరి  స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. 

ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చాలని కోరుతూ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ అవసరమని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీంతో ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.

ఈ ఏడాది మార్చి లో సీబీఐ ఉన్నతాధికారులను కలిసి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను గుర్తించాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కోరారు. సునీత ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ మరింత వేగవంతమైంది.కడప కేంద్రంగా చేసుకొని సీబీఐ అధికారులు విచారణను కొనసాగించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇవాళ శంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

click me!