వల్లభనేని రాజీనామా వెనక వైఎస్ జగన్ వ్యూహం ఇదే...

By telugu teamFirst Published Oct 28, 2019, 11:57 AM IST
Highlights

తన రాజీనామా విషయంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహం కూడా కలగలిసి ఉందనే సందేహం వ్యక్తమవుతోంది.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ రాజీనామా వెనక ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో వల్లభనేని వంశీ కూడా తెలివిగా వ్యవహరించారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వంశీ తన లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. 

ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ సూచించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు సూచించారు. ఈ నేపథ్యంలో కర్ర విరగకుండా పాము చావకుండా వల్లభనేని వంశీ విషయంలో వ్యవహరించారనే మాట వినిపిస్తోంది. 

Also Read: చంద్రబాబు లేఖకు వల్లభనేని వంశీ జవాబు ఇదీ...

శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లేఖను వల్లభనేని వంశీ స్పీకర్ కు సమర్పించలేదు. ఇందులోనే మతలబు అంతా ఉందని అంటున్నారు. వల్లభనేని వంశీ రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఆ లేఖకు సమాధానంగా వంశీ చంద్రబాబుకు మరో లేఖ రాశారు. తద్వారా పరిణామానికి ఆయన కొత్త మలుపు ఇచ్చారు. 

సోమవారం మధ్యాహ్నం తన ప్రత్యర్థి యార్లగడ్డ వెంకటరావు వైఎస్ జగన్ తో భేటీ కానున్న నేపథ్యంలో వంశీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. కృష్ణా జిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలను వెంట పెట్టుకుని వంశీ వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. తాను ఎదుర్కుంటున్న చిక్కులను వంశీ జగన్ కు వివరించారు. వైసిపితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వంశీ ముఖ్యమంత్రితో చెప్పారు. అందుకు జగన్ కూడా అంగీకరించారు. 

దాంతో యార్లగడ్డ వెంకటరావు అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని యార్లగడ్డ వెంకట రావు జగన్ ను కోరారు. దీంతో గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. తాను జగన్ ను కలుస్తున్నానని, జగన్ తగిన న్యాయం చేస్తారని యార్లగడ్డ తన అనుచరులను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో యార్లగడ్డకు టోకరా ఇవ్వడానికో, జగన్ వ్యూహరచనలో భాగంగానో తెలియదు గానీ వంశీ తన రాజీనామాను చంద్రబాబుకు మాత్రమే పంపించారు. 

Also Read: అండగా ఉంటా, అది సరైంది కాదు: వల్లభనేని వంశీకి బాబు ధైర్యం..

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వంశీ చంద్రబాబుకు రాసిన లేఖను స్పీకర్ కు పంపించకపోతే వ్యూహాత్మకంగా విమర్శలు ఎక్కుపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెసు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వంశీ రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించలేదని చెప్పే అవకాశం ఉంటుంది. 

టీడీపీకి రాజీనామా చేసి వైసిపిలో చేరితే అనర్హత వేటు పడుతుందని భావించిన వంశీ వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. అలా కాకుండా టీడీపీకి రాజీనామా చేసి, వైసిపిలో చేరకుండా తటస్థ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశంం వంశీకి ఉంటుంది. దీని వల్ల గన్నవరం నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు తప్పుతాయని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు అయితే, వంశీ విషయంలో జగన్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. 

click me!