వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిని పిట్టలదొరగా వర్ణించారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు నమ్మించటమే చంద్రబాబు పని అంటూ మండిపడ్డారు. పాదయాత్ర సందర్భంగా అనంతపురం జిల్లాలోని పుటపర్తిలో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలన మొత్తం అబద్దాలు, మోసాలతోనే సాగుతున్నట్లు మండిపడ్డారు. చంద్రబాబు మాటలు విని మరోసారి మోసపోవద్దంటూ జనాలకు చెప్పారు.
సిఎం నాలుగేళ్ళ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంగా లేరంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలు విన్నందుకే అనంతపురంలో రైతులు రోడ్డున పడినట్లుగా ధ్వజమెత్తారు. సిఎం మాటలు నమ్మి రోడ్డునపడిన రైతుల్లో ఒకడంటూ నల్లమాడకు చెందిన రైతు శివన్నను చూపించారు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేస్తే కానీ రాష్ట్రం బాగుపడదన్నారు. అందుకు ప్రజలు కూడా తనకు సహకరించాలంటూ చెప్పారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఎస్సీ మహాళ విషయంలో టిడిపి నేతలు కీచకుల్లా వ్యవహిరించారంటూ మండిపడ్డారు.