
తిరుపతి : కొడుకు ప్రేమ వివాహం తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. తన చెల్లిని లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడి ఇంటికి వెళ్లీమరీ అతడి తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దారుణం తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మతకామూడి గ్రామానికి చెందిన గంటల గజేంద్ర రెడ్డి(40) కొడుకు మునుస్వామి గతంలో కులాంతర వివాహం చేసుకున్నాడు. గ్రామానికే చెందిన యువతిని ప్రేమించిన మునుస్వామి వారి కుటుంబసభ్యులను ఎదిరించి పెళ్ళిచేసుకున్నాడు. దీంతో కుటుంబ పరువు తీసాడంటూ మునుస్వామిపై యువతి సోదరుడు కృష్ణాపురం చందు కోపంతో రగిలిపోతున్నాడు.
మునుస్వామి కుటుంబంతో కక్ష పెంచుకున్న చందు తాజాగా దారుణానికి ఒడిగట్టాడు. పదునైన కత్తితో మునుస్వామి ఇంటికి వెళ్లి నోటికొచ్చిన బూతులతో తిట్టడం ప్రారంభించాడు. దీంతో అతన్ని సముదాయించేందుకు గజేంద్ర రెడ్డి దగ్గరకు వెళ్లగా వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడ్డ అతడు రక్తపుమడుగులో కుప్పకూలగా చందు అక్కడినుండి పరారయ్యాడు.
వీడియో
కుటుంబసభ్యులు గజేంద్ర రెడ్డిని 108 అంబులెన్స్ లో సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం గూడూరు హాస్పిటల్ కు తరలించారు. గజేంద్ర రెడ్డి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న నిందితుడు చందు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.