వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం మీద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. సమాజహితం కోసం వారిద్దరూ కలివాల్సిందేనని అన్నారు.
ఢిల్లీ : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవడం మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజ హితం కోసం వారిద్దరూ కలవాల్సిందేనని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో రఘురామకృష్ణం రాజు విలేకరులతో మాట్లాడారు. జనసేన రంగు ఎరుపు అని.. టిడిపి రంగు పసుపు అని.. ఆ రెండు కలవడం వల్ల కాషాయం ఏర్పడుతుందని అన్నారు. మరో పార్టీ ఈ రెండు పార్టీలకు తోడుండాలని అన్నారు. అలా కోరుకునే వారిలో తాను ఒకడినని చెప్పారు.
ఒక్క పార్టీతో బలం సరిపోనప్పుడు.. గౌరవాన్ని కాపాడుకుంటూనే మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సూచన చాలా చక్కగా, బాగుందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తాయని రణస్థలం వేదికగా జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారని అన్నారు. ఈ పొత్తుపై వైసీపీ నేతలు ప్రశ్నించడం గమ్మత్తుగా ఉందన్నారు. గతంలో చంద్రబాబును పవన్ కళ్యాణ్ విమర్శించారని.. ఇప్పుడు పొత్తు ఎలా పెట్టుకుంటారనడం విచిత్రంగా ఉందని రఘురామా అన్నారు.
పొలిటికల్ జోకర్: పవన్ డైమండ్ రాణి వ్యాఖ్యలకు రోజా కౌంటర్
ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో ఉన్న పలువురు నేతలు గతంలో ఆయనను విమర్శించిన వారేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. వల్లభనేని వంశీ, జూపూడి ప్రభాకర్ రావు ఇప్పుడు వైసీపీలో చేరారని.. కానీ, గతంలో జగన్ ను విమర్శించిన వారేనని గుర్తు చేశారు. బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి లోని..డైలాగులు కొన్నింటిని చూసి తమ పార్టీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని.. ఇది హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.