సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న వైసిపి ఎమ్మెల్యే... అవాక్కయిన అభ్యర్థులు

By Arun Kumar PFirst Published Apr 5, 2021, 12:21 PM IST
Highlights

ఎన్నికల ప్రచారం, సభల్లో గందగోళం ఎక్కువగా వుంటుంది కాబట్టి చాలామంది ఫ్లోలో ఒకటి మాట్లాడబోయి మరోటి మాట్లాడుతుంటారు. అలాంటి ఘటనే ఆంధ్ర ప్రదేశ్ ఎంపిటీసి, జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో జరిగింది. 
 

ఉంగుటూరు: అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే నాయకులు సైతం కొన్నిసార్లు తడబడుతుంటారు. ఇలా తడబడినా కవర్ చేసుకునే నైపుణ్యాన్ని మాత్రం కొందరు నాయకులు మాత్రమే కలిగివుంటారు. ఇక ఎన్నికల ప్రచారం, సభల్లో గందగోళం ఎక్కువగా వుంటుంది కాబట్టి చాలామంది ఫ్లోలో ఒకటి మాట్లాడబోయి మరోటి మాట్లాడుతుంటారు. అలాంటి ఘటనే ఆంధ్ర ప్రదేశ్ ఎంపిటీసి, జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో జరిగింది. 

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు వైసిపి జడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మి తరఫున గోపీనాథపట్నంలో ప్రచారం చేపట్టారు. ఇందులోభాగంగా ప్రచార వాహనంపై మైక్ అందుకున్న ఎమ్మెల్యే ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ గుర్తయిన సైకిల్ కు ఓటేయాలంటూ సూచించారు. అంతలోనే తప్పు తెలుసుకున్న ఆయన కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అయినప్పటికి ఆయన సైకిల్ గుర్తుకు ఓటేయాలంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక మాటల తడబాటువల్ల ఎక్కువగా అభాసుపాలైన నాయకుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ముందు వరుసలో వుంటారు. విద్యాభ్యాసం విదేశాల్లో జరగడంతో ఆయన తెలుగు పదాలను స్పష్టంగా ఉచ్చరించలేకపోతారు. దీంతో ఒకటి మాట్లాడబోయి మరోటి అనడం... అది కాస్తా  వైసిపి అస్త్రంగా మారిపోవడం జరిగింది. అలాగే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లోకేష్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా సారే జహాసె అచ్చా పాడబోయి తడబడిన విషయం తెలిసిందే. ఆయన బుల్ బుల్ అంటూ కాస్సేపు స్ట్రక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తాజాగా వాసుబాబు కూడా మాటల తడబాటుతో నియోజకవర్గ ప్రజలముందు నవ్వులపాలయ్యారు. 
 

click me!