ఏపీలో మంత్రుల బస్సు యాత్ర: శ్రీకాకుళంలో ఆరంభం.. అనంతలో ముగింపు, పోస్టర్ విడుదల

By Siva KodatiFirst Published May 19, 2022, 7:35 PM IST
Highlights

ఏపీలో ఈ నెల 26 నుంచి జరగనున్న మంత్రుల బస్సు యాత్రకు సంబంధించి పోస్టర్‌ను విడుదలైంది. బస్సు యాత్ర శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 

ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీ (ysrcp) మంత్రులు బస్సు యాత్ర (ministers bus yatra) చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం నాడు మంత్రులు బొత్స సత్యనారాయణ (botsa satyanarayana), ధర్మాన ప్రసాదరావు (dharmana prasada rao) , చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (chelluboina srinivasa venugopalakrishna), మేరుగ నాగార్జున (merugu nagarjuna) బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నామని చెప్పారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు వరుసగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బస్సు యాత్ర శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుందన్నారు.

బస్సు యాత్రలో 17 మంది మంత్రులతో పాటు వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ధర్మాన వెల్లడించారు. పాలన చేసే వారుగా ఎప్పుడు మారతామన్న ఆవేదన ఈ నాలుగు వర్గాల్లో ఉందని.. వీరి ఆత్మ ఘోషణను నివారించడానికి వైసీపీ కంకణం కట్టుకుందని ప్రసాదరావు పేర్కొన్నారు. గతంలో బలహీన వర్గాలకు మంత్రి పదవి ఇస్తే చాలా గొప్ప విషయంగా భావించే వారని ధర్మాన  గుర్తుచేశారు.

Also Read:ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రుల బ‌స్సు యాత్ర‌... ముహూర్తం ఎప్పుడంటే..? 

వెనుకబడిన వర్గాల వారు మంత్రి పదవులు పొందడానికి అర్హులు కారనే భావజాలం ఉండేదని.. కానీ ప్రస్తుత కేబినెట్‌లో 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉండటం గమనించాల్సిన విషయమన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాలకు ఒక రాజ్యసభ స్థానం ఇచ్చిన దాఖలాలు కూడా లేవని.. కానీ టీడీపీ వాళ్లు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ ధర్మాన ప్రసాదరావు చురకలు వేశారు.

ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయలేదని చెప్పి నమ్మించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికే తాము బస్సు యాత్ర చేస్తున్నట్లు ధర్మాన చెప్పారు. రాజ్యసభకు ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేస్తే తెలంగాణ వ్యక్తి అంటున్నారని… చంద్రబాబు ఎక్కడ ఉంటున్నారో చెప్పాలని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. ప్రాంతం ముఖ్యం కాదని.. బీసీ వర్గాలకు ఆర్.కృష్ణయ్య చేసిన కృషిని గుర్తించామని పేర్కొన్నారు. 77 శాతం బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. 
 

click me!