
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఓడిపోతామనే భయం వైసీపీ అధినేత జగన్ కు పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం నంద్యాల ప్రచారంలో మాట్లాడిన రాజశేఖర్, జగన్ పై దుమ్మెత్తి పోశారు.
అడ్డదారులు తొక్కైనా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ ఓటమి భయంతోనే గత 12 రోజులుగా నంద్యాలలోనే మకాం వేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏ ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గంలో 12 రోజుల పాటు ప్రచారం చేసిన దాఖలాల లేవని అన్నారు. జగన్ అవినీతిని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని, నంద్యాల ఓటర్లు చాలా తెలివైనవారని... వారంతా అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీకి ఓటు వేయడం దండగ అనే ఆలోచనలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక ఓటమీకి వైసీపి సాకులు వెతుక్కోవాలని ఆయన సూచించారు.