నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుపును ప్రజలు ఎప్పడో నిర్ణయించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. శనివారం నంద్యాలలో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నంద్యాలను అద్బుత పట్టణంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు, ప్రచారంలో వైసీపి నేతల పై కూడా విరుచుకుపడ్డారు.
నంద్యాలను స్మార్ట్ నంద్యాలగా మారుస్తామని ఆయన పెర్కొన్నారు. మూడు నెలల్లో 285 పనులు మంజూరు చేశామన్నారు. నంద్యాల్లో రూ.2200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతోన్నాయన్నారు. రాష్ట్రాన్ని తాను బాగు చేస్తాననే నమ్మకంతోనే ప్రజలు తనకు అధికారం కట్టబెట్టారని పెర్కొన్నారు. రాష్ట్రంలో విభజన అనంతరం ఎన్నో కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాటిపై పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. అనునిత్యం ప్రజల అభ్యున్నతే తన ధ్యాసగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను మూడేన్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ది యజ్ఞం చేస్తుంటే వైసీపి నేతలు భగ్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
వైసీసి నేతలకు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదని, కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కనబడుతోందని అన్నారు సీఎం. భారతదేశంలో నంబర్ రాష్ట్రంగా తీర్చీదిద్దడానికి కష్టపడుతున్నామన్నారు. అందుకే తమ పార్టీ పథకాల అమలులో ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదని అన్నారు. డ్వాక్రా, దీపం పథకాలు తన మానస పుత్రికలని పెర్కొన్నారు. దీపం పథకాన్ని కాంగ్రెస్ ఆర్పేసిందని ఆరోపించారు. మహిళల అభివృద్ది కోసం డ్వాక్రా సంఘాలకు సగానికి పైగా డబ్బులు ఇచ్చామని, త్వరలో మిగిలిన సొమ్మునూ కూడా అందజేస్తామని చంద్రబాబు అన్నారు.