దర్శిలో యాక్టివ్ అయిన బూచేపల్లి: వైసిపిలో జోష్

First Published Mar 2, 2018, 11:48 AM IST
Highlights
  • దర్శి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్ఏ  బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మొత్తానికి ప్రకాశంజిల్లాలో బూచేపల్లి కుటుంబం వైసిపిలో మళ్ళీ యాక్టివ్ అయ్యింది. దర్శి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్ఏ  బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏవో కుటుంబ సమస్యల పేరుతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఒకపుడు వైసిపి తరపున నియోజకవర్గంలో అంతా తానే అయి వ్యవహారాలు నడిపేవారు. అటువంటిది ఏమైందో ఏమో హటాత్తుగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఒకవైపు ఎన్నికలు ముంచుకువస్తున్నాయి. ఇంకోవైపు బూచేపల్లేమో దూరంగా ఉంటున్నారు. ఇదే విషయమై బూచేపల్లితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఉపయోగం కనబడలేదు. దాంతో చేసేది లేక ఇంకోరిని సమన్వయకర్తగా నియమించారు. అయితే, నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల నుండి సమన్వయకర్తకు పెద్దగా సానుకూలత కనబడలేదు.

పార్టీ సమన్వయకర్తగా ఎవరి నియమించినా వాళ్ళ విజయానికి కృషి చేస్తానని బూచేపల్లి ప్రకటించినా ఎవరూ అంగీకరించలేదు. దాంతో నియోజకవర్గంలో పార్టీ పరంగా నాయకత్వానికి గ్యాప్ వచ్చింది. ఈ నేపధ్యంలోనే పాదయాత్రలో భాగంగా జగన్ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించారు. మూడు రోజుల క్రితం దర్శి నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు.

జగన్ జిల్లాలోకి ప్రవేశించగానే బూచేపల్లి నేరుగా జగన్ ను కలిసి మాట్లాడారు. అంతేకాకుండా దర్శి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన దగ్గర నుండి ప్రత్యేకంగా జగన్ తో పాదయాత్రలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఒక్క బూచేపల్లే కాదు. మొత్తం కుటుంబమంతా జగన్ తో పాదయాత్రలో పాల్గొంటున్నారు. దాంతో నేతల్లో, కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ వచ్చేసింది. ఎలాగూ తనతో పాదయాత్రలో పాల్గొంటున్నారు కాబట్టి జగన్ ప్రతిరోజు బూచేపల్లితో మాట్లాడుతూనే ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బూచేపల్లి పోటీ చేయటం ఖాయమంటూ ప్రచారం ఊపందుకున్నది.

click me!