వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపిస్తూ విశాఖపట్నంలో వైసిపి చేపట్టిన వంచన వ్యతిరేక దినం దీక్షలపై ఆయన మండిపడ్డారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించడం వంచన కాదా అని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు లోటస్ పాండ్, బెంగళూరు, ఎలహంక, ఇడుపులపాయల్లో జగన్ రాజభవనాలు నిర్మించింది పేదల సొమ్ముతో కాదా అని ఆయన ప్రశ్నించారు. పేదల సొమ్మును దోచుకున్న జగన్ మించిన వంచకుడెవరుంటారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్ారు.
నాలుగు రోజులు పాదయాత్ర, 2 రోజులు న్యాయవాదులతో భేటీ, ఓ రోజు కోర్టు బోనెక్కడం వంచన కాదా అని నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో సోనియాతో లాలూచి పడి జగన్ బెయిల్ తెచ్చుకోవడం వంచన కాదా అని అడిగారు. కేసుల మాఫీ కోసం బిజెపితో లాలూచీ పడడం వంచన కాదా అని ప్రశ్నించారు.
పోలవరంపై ఫిర్యాదులు, కోర్టు కేసులతో అడ్డుకోవడం జగన్ వంచన కాదా అడిగారు. బాబాయితో లేఖలు రాయించి ఉపాధి కూలీల పొట్ట కొట్టడం వంచన కాదా అని అన్నారు. రాజధానిపై కోర్టుల్లో కేసులు వేయించి ల్యాండ్ పూలింగ్ ను అడ్డుకోవడం కూడా వంచనే అని అన్నారు.
బిజెపి నమ్మకద్రోహం చేస్తే జగన్ విమర్శించకపోవడం నయవంచన కాదా యనమల అడిగారు. మోడీని ప్రశ్నిస్తే బేడీలు పడుతాయని జగన్ కు భయమని ఆయన వ్యాఖ్యానించారు.