‘తనకు తెలంగాణాలో కాంట్రాక్టులుంటే వాటిని రేవంత్ రెడ్డే తీసుకోవచ్చు’ ఇవి ఏపి సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడి స్పందన. ఏపి మంత్రి యనమల తెలంగాణాలో రూ. 2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు తీసుకున్నారని రేవంత్ ఆమధ్య ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందే. సిఎం కెసిఆర్ తో టచ్ లో ఉండటం ద్వారా యనమలతో పాటు మరో మంత్రి పరిటాల సునీత, ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ ఇద్దరూ బీర్ల ఫ్యాక్టరీకి లైసెన్సులు పొందారంటూ పెద్ద బాంబే పేల్చారు. దాంతో రెండు రాష్ట్రాల్లోని టిడిపి నేతల్లో కలవరం మొదలైంది.
ఆ విషయమై సోమవారం యనమల మీడియాతో మాట్లాడుతూ, తనకు కాంట్రాక్టులుంటే రేవంతే తీసుకోవచ్చన్నారు. అంతేకాకుండా ఓకవేళ కాంట్రాక్టులపై కమీషన్ వచ్చినా వాటినీ రేవంతే తీసుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీ నుండి వెళ్ళటానికే రేవంత్ తనపై ఆరోపణలు చేశారేమో అంటూ ఓ ధర్మ సందేహాన్నే వ్యక్తం చేసారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, యనమల మాటల్లో సమర్ధన, అతి తెలివే కనబడుతోంది.
ఎలాగంటే, రేవంత్ చెప్పిన ప్రకారం యనమల కెసిఆర్ ద్వారా రూ. 2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు పొందారని. అంటే దాని అర్దం నేరుగా రూ. 2 వేల కోట్లు యనమల జేబులో పడ్డాయని కాదా కదా? యనమల వియ్యంకుడు, పుట్టా సుధాకర్ యాదవ్ కు నిర్మాణ సంస్ద ఉంది. ఆ సంస్దకే యనమల రూ. 2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని రేవంత్ చెప్పింది.
యనమలకు ధైర్యముంటే ఆ విషయంపై వివరణ ఇవ్వాలి. అంతేకానీ టిడిపిలో నుండి బయటకు వెళ్ళిపోదలచుకున్నారు కాబట్టే తనపై ఆరోపణలు చేశారేమో? అని అనటంలో అర్ధమేలేదు. ఎందుకంటే, పార్టీ నుండి బయటకు వెళ్ళిపోదలుచుకున్న రేవంత్ కు యనమల గురించి మాట్లాడితే ఏమోస్తుంది? అప్పటికేదో తనతో పడని కారణంగానే రేవంత్ టిడిపిలో నుండి బయటకు వెళ్ళిపోయారన్న అర్దంవచ్చేట్లు యనమల పెద్ద బిల్డపే ఇస్తున్నారు.