అదనపు కట్నం కోసం వేధింపులు.. విశాఖలో అత్తవారింటి ముందు కోడలు బైఠాయింపు

Published : Aug 11, 2021, 07:46 PM IST
అదనపు కట్నం కోసం వేధింపులు.. విశాఖలో అత్తవారింటి ముందు కోడలు బైఠాయింపు

సారాంశం

ఆడపిల్ల పుట్టిందని, అప్పులు పెరిగాయని పేర్కొంటూ అదనపు కట్నం తేవాలని అత్తింటివారు డిమాండ్ చేయడంతో విశాఖలోని నర్సిపట్నంలో ఓ వివాహిత అత్తవారింటి ముందు బైఠాయించారు. ఇంటిలోకి రానివ్వకుండా తలుపులు వేసుకోవడంతో బైఠాయించినట్టు బాధితురాలు వివరించారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ వివాహిత అత్తవారింటి ముందు బైఠాయించారు. అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె మీడియా ముందు వాపోయారు. అదనపు కట్నం తెస్తేనే ఇంటిలోకి రానిస్తామని అత్త చెప్పిందని, అప్పటి నుంచి ఆమెకు ఇంటి తలుపులు తెరవడం లేదని చెప్పారు. అందుకే ఇంటి ముందే బైఠాయించినట్టు వివరించింది. నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పెద్దబొడ్డేపల్లి బీసీ కాలనీలో నివాసముంటున్న మాచిన పార్వతిని పెళ్లైన తొలి ఐదు నెలల వరకు బాగానే చూసుకున్న భర్త, అత్తింటి వారు అటుతర్వాత వేధింపులు ప్రారంభించారు. తన భర్తకు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చిందని చెబుతూ మరింత కట్నం తేవాలని అత్తింటివారు డిమాండ్ చేసినట్టు పార్వతి ఆరోపించారు. అంతేకాదు, ఆమెకు ఆడపిల్ల పుట్టిందని, అప్పులూ పెరిగాయని పేర్కొంటూ అదనపు కట్నం తేవాల్సిందేనని, అప్పటి వరకు ఇంటిలోకి రానివ్వబోమని బయటికి పంపినట్టు తెలిపారు.

తన పెళ్లిలో 12 లక్షల కట్నం ఇచ్చారని, నాలుగు తులాల బంగారం, ఒక ఎకరం భూమి కూడా తన భర్త రామకృష్ణకు ఇచ్చారని పార్వతి వివరించారు. అయినా అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని, అత్త, ఆడపడుచూ అందరూ ఇలాగే వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగానే తన తల్లి గుండెపోటుతో మరణించారన్నారు. ఈ విషయమై పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu