మందుబిళ్లలు అనుకుని ఎలుకల మందు తిని ఓ మహిళ మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది.
గుంటూరు: ట్యాబ్లెట్స్ అనుకుని ఎలుకల మందు తిని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ ఇలా పొరపాటున ఎలుకల మందు తీసుకుంది. దీంతో ఇంట్లోనే తీవ్ర నరకయాతన అనుభవించిన ఆమె ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని చినఅరవపల్లి గ్రామానికి చెందిన భూపతి వీరరాఘవయ్య-రాజేశ్వరి దంపతులు.కొన్నేళ్ళ క్రితం రాజేశ్వరి(42) మతిస్థిమితం కోల్పోయింది. దీనికి తోడు పక్షపాతానికి గురవడంతో ఇంటికే పరిమితమయ్యింది.
read more ఎస్సై భార్య ఆత్మహత్య ! పట్టపగలు, పక్కగదిలో భర్త ఉండగానే ఘటన... !!
కుటుంబసభ్యులు పనులపై బయటకు వెళ్లగా రాజేశ్వరి ఇంట్లో ఒంటరిగా వుండేది. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం ఒంటరిగా వున్న రాజేశ్వరి మందుబిళ్ల(ట్యాబ్లెట్) అనుకుని పందికొక్కుల నివారణ కోసం దాచిన ఎలుకల మందు మింగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయి ఇంట్లోనే స్పృహ కోల్పోయి పడిపోయింది.
ఇలా చాలాసేపు నరకయాతన అనుభవించిన ఆమెను ఇంటి చుట్టుపక్కల వారు గుర్తించారు. ఆమె కొడుకుకు సమాచారం అందించగా అతడు ఇంటికి చేరుకుని తల్లిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే రాజేశ్వరి కన్నేమూసింది. మృతురాలి తల్లి అంజనాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.