వివాహేతర సంబంధం : భర్తను బకెట్ తో కొట్టి.. దారుణంగా చంపిన భార్య, అత్తామామలు.. !!

By AN TeluguFirst Published Apr 3, 2021, 12:41 PM IST
Highlights

తాళికట్టిన భర్తనే కర్కశంగా కడతేర్చిందో భార్య.. కూతురి కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తామామలే అల్లుడిని అనంత లోకాలకు పంపించేశారు.

తాళికట్టిన భర్తనే కర్కశంగా కడతేర్చిందో భార్య.. కూతురి కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తామామలే అల్లుడిని అనంత లోకాలకు పంపించేశారు.

భీమిలీ, పద్మనాభం మండలంలోని కృష్ణాపురం రెల్లి కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. దీనికి సంబంధించి సీఐ విశ్వేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రెల్లి కాలనీకి చెందిన పల్లా కనకరాజు(40)కు విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన పైడమ్మతో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది.

కృష్ణాపురంలోని స్ప్రింగ్‌ ఫీల్డ్ పాఠశాల బస్సులో కనకరాజు క్లీనర్ గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా పైడమ్మ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గతంలో కనకరాజు ఆమె నిలదీశాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల కిందట వీరిమధ్య మళ్లీ గొడవ జరిగింది.

కనకరాజు మామ సోమాదులు సోములు, అత్త పాపయ్యమ్మ, బావమరిది కంచయ్య, బావమరిది భార్య లక్ష్మి ఈనెల ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చారు. భార్యతో సహా వీరందరూ కనకరాజు తలపై బకెట్‌తో దారుణంగా కొట్టారు. ఆ తరువాత ఎవరికీ చెప్పకుండా అందరు తిరిగి వెళ్లిపోయారు.

సాయంత్రం ఐదు గంటల సమయంలో అతని తల్లి లక్ష్మీ ఇంటికి వచ్చి చూస్తే.. తల, పెదవుల మీద గాయాలతో కనకరాజు మంచం మీద పడి ఉండటంతోషాక్ కు గురైంది. ఏం జరిగిందని అడగగా, జరిగిన విషయం చెప్పాడు. 

వెంటనే ఆమె విజయనగరం మహారాజా ఆస్పత్రిలో కనకరాజు ను చేర్పించింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అతను మృతి చెందాడు. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని భార్య తో సహా ఐదుగురి పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

click me!