చంద్రబాబు..ఏంటి రెవిన్యూ వెంటపడ్డారు?

Published : Feb 25, 2017, 04:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
చంద్రబాబు..ఏంటి రెవిన్యూ వెంటపడ్డారు?

సారాంశం

త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో కెఇని పక్కన బెట్టే ఆలోచనేమన్నా చంద్రబాబుకు ఉందా అనే చర్చ మొదలైంది.

‘కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చద’నే ముద్ర వేయాలట. అలానే ఉంది చంద్రబాబునాయడు వ్యవహారం. అవినీతి పెరిపోయిందంటూ కొద్ది రోజులుగా రెవిన్యూశాఖపై బాగా ఫైర్ అవుతున్నారు. రెవిన్యూశాఖలో అవినీతన్నది ఈనాటి మాట కాదు. ఆమాటకొస్తే పోలీసు, మున్సిపాలిటీ, పంచాయితీరాజ్, విద్యుత్, గనులు, భూగర్భశాఖ, ఇరిగేష్ లాంటి అనేక శాఖలపై ఎప్పటి నుండో తీవ్ర ఆరోపణలున్నాయి. రాజధాని వ్యవహారాలు చూస్తున్న సిఆర్డిఏపైనే ఎన్నో ఆరోపణలున్నాయి. మరి వాటి విషయంలో ఎన్నడూ ఎవరినీ లక్ష్యంగా చేసుకున్నట్లు కనబడని సిఎం ఒక్క రెవిన్యూశాఖపైనే ఎందుకంత ఫోకస్ పెట్టారు?

 

ఇదే విషయమై పార్టీ, ప్రభుత్వంలో చర్చ మొదలైంది. గతంలో కూడా రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి వేదికపై ఉన్నపుడే పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. కెఇ పేరుకే మంత్రిగానీ మొత్తం వ్యవహారాలన్నీ సిఎం పేషీనే చక్కబెడుతోందనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. ‘తహసీల్దార్లను మీరు కంట్రోల్ చేస్తారా? లేక నన్ను చేయమంటారా’ అంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించటం భలే క్యామిడీగా ఉంది. రెవిన్యూశాఖలో భారీ అవినీతి జరుగుతోందని సమాచారం ఉన్నపుడు సిఎం ఎందుకు ఇంతకాలం మౌనంగా ఉన్నారు. పట్టుబడ్డ తహసీల్దార్ వద్ద అన్ని కోట్ల రూపాయలేమిటి? అని సిఎం ఆశ్చర్యపోవటం మరీ విచిత్రం. తహసీల్దార్ వద్దే కాదు రెవిన్యూ ఇన్ స్పెక్టర్ల వద్ద, అటెండర్ల వద్ద కూడా కోట్ల రూపాయలు పట్టుబడ్డ ఘటనలున్నాయి.

 

తప్పు చేసిన వారికి శిక్షపడితే ఇంకోరు తప్పు చేయటానికి భయపడతారు. అవినీతి అధికారులపై చర్యలు అవసరం లేదంటూ స్వయంగా సిఎమ్మే గతంలో నిర్ణయం తీసుకోలేదా? విశాఖపట్నం డిప్యుటీ కలెక్టర్ గా పోస్టింగ్ కోసం ఓ అధికారి కోట్ల రూపాయలు చదివించుకున్నారంటూ పెద్ద సంచలన రేగింది. అప్పుడు ఎవరిపై చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. అంతెందుకు, తన పేషిలోని అధికారులపైనే ఆరోపణలున్న మట వాస్తవమే కదా ? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ వదిలేసి కేవలం రెవిన్యూశాఖలోని అవినీతిపైనే ఎందుకు ఫోకస్ పెడుతున్నట్లు?

 

బహుశా త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో కెఇని పక్కన బెట్టే ఆలోచనేమన్నా చంద్రబాబుకు ఉందా అనే చర్చ మొదలైంది. వివిధ సంస్ధలకు భూ కేటాయింపుల్లో  రెవిన్యూశాఖ చాలా కీలకమైన పాత్ర పోషించాలి. అందులో భాగంగానే ఆ శాఖను లోకేష్ కు గానీ లేదా తన ఇష్టుల్లో ఎవరికైనా కట్టబెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలూ మొదలయ్యాయి.

PREV
click me!

Recommended Stories

బీజేపీచేస్తున్న కుట్రను ఎదుర్కోడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం | YS Sharmila | Asianet News Telugu
Varudu Kalyani Comments on Pawan Kalyan: డైలాగ్స్ వద్దు చర్యలు తీసుకోండి | Asianet News Telugu