మహానాడుకు గైర్హాజర్: చంద్రబాబుకు హరికృష్ణ దూరమేనా?

Published : May 28, 2018, 02:39 PM IST
మహానాడుకు గైర్హాజర్: చంద్రబాబుకు హరికృష్ణ దూరమేనా?

సారాంశం

తెలుగుదేశం పార్టీ మహానాడుకు మాజీ పార్లమెంటు సభ్యుడు, ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ మహానాడుకు మాజీ పార్లమెంటు సభ్యుడు, ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ఆహ్వానం అందలేదా, హరికృష్ణనే వెళ్లలేదా అని స్పష్టంగా తెలియదు. మొత్తం మీద, హరికృష్ణ మాత్రం మహానాడుకు గైర్హాజరయ్యారు.

మహానాడుకు ఎందుకు వెళ్లలేదని మీడియా ప్రతినిధులు అడిగితే హరికృష్ణ సమాధానం దాటవేశారు. హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య దూరం పెరుగుతోందనే విషయం కొత్తదేమీ కాదు. చాలా కాలంగా వారిద్దరి మధ్య విభేదాలు పొడసూపుతున్నట్లు చెబుతున్నారు. 

నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం ఇస్తూ చంద్రబాబు తనకు వారసుడిగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఉన్నారనేది కూడా కొత్త విషయమేమీ కాదు. గతంలో ఈ విషయంపైనే హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య విభేదాలు పొడసూపాయనే విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారు. టీడీపికి ఆయన పూర్తిగా దూరమయ్యారు. 

కానీ, హరికృష్ణ మధ్య మధ్యలో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిననంత వరకు అది అత్యంత ముఖ్యమైంది. రాజకీయంగా కూడా అతి ముఖ్యమైందే. మహానాడులోనే టీడిపి విధివిధానాలను ఖరారు చేసుకుంటుంది. అటువంటి మహానాడుకు హరికృష్ణ హాజరు కాలేదంటే అంతర్గతంగా ఏదో జరుగుతున్నట్లే ఎవరైనా భావిస్తారు. చంద్రబాబుకు హరికృష్ణ పూర్తిగా దూరమవుతారా అనేది చూడాల్సిందే.

PREV
click me!

Recommended Stories

రికార్డ్ సృష్టించిన తెలుగు విద్యార్థిని! చంద్రుడి మిషన్‌కు ఎంపిక | AP Student with Mission ShaktiSat
ఏనుగుల బెడదకు చెక్! పవన్ కీలక నిర్ణయం | Pawan Kalyan Launches Guchchimi Elephant Camp