ఏం జరిగింది: గవర్నర్ పై చంద్రబాబు ఆగ్రహానికి కారణం ఏమిటి?

First Published Apr 25, 2018, 1:31 PM IST
Highlights

గవర్నర్ నరసింహన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కోపం రావడం వెనక కారణమేమిటనే విషయంపై రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

అమరావతి: గవర్నర్ నరసింహన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కోపం రావడం వెనక కారణమేమిటనే విషయంపై రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

గవర్నర్ ఇటీవల విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్తూ మధ్యలో ఆగి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ భేటీ నిజానికి ముందు నిర్ణయించుకున్నది కాదు. అయితే, కేంద్రం పెద్దల నుంచి వచ్చిన సూచన మేరకు చంద్రబాబుతో ఆయన సమావేశమైనట్లు చెబుతున్నారు.

బిజెపితో తెగదెంపులు చేసుకున్న తర్వాత నరసింహన్ చంద్రబాబుతో జరిపిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. ఎన్డీఎ నుంచి వైదొలగడం సరి కాదని, తిరిగి ఎన్డిఎలోకి రావాలని నరసింహన్ చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. 

దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో చంద్రబాబుతో ఆయన ఏం మాట్లాడనే వివరాలు బయటకు రాలేదు గానీ బిజెపితో తెగదెంపులు చేసుకోవడం వల్ల తలెత్తే పరిణామాలపై మాట్లాడినట్లు చెబుతున్నారు. 

అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప బిజెపితో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి వీలు కాదని చంద్రబాబు గవర్నర్ తో స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చెప్పేందుకే నరసింహన్ ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు. 

నాలుగు రోజుల వ్యవధిలోనే చంద్రబాబు ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్, నరసింహన్ చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్ చంద్రబాబుతో భేటీ కావడంపై కూడా ఊహాగానాలు చెలరేగాయి. అయితే, రాజీవ్ జైన్ చంద్రబాబుతో భేటీ కావడంలో తప్పేమీ లేదని బిజెపి నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 

click me!