పోలవరం ప్రాజెక్టు పరిశీలన విషయంలో కేంద్ర జనవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మొహం చాటేస్తున్నారా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే, ప్రాజెక్టును కేంద్రమంత్రి స్వయంగా పరిశీలిస్తారని ఇప్పటికి చాలాసార్లే చెప్పటం మళ్ళీ వాయిదా వేయటం మామూలైపోయింది. గతంలో ఒకసారి చంద్రబాబునాయుడుతో కలసి ప్రాజెక్టును సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే, తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ ప్రాజెక్టువైపు గడ్కరీ తిరిగి కూడా చూడలేదు. ఇప్పటికి ఓ ఐదుసార్లైనా ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నట్లు కేంద్రమంత్రి కార్యాలయం నుండి రాష్ట్రానికి సమాచారం రావటం వెంటనే రావటం లేదని చెప్పటం మామూలైపోయింది. ఇదంతా ఎందుకంటే, తాజాగా అంటే ఏప్రిల్ 1వ తేదీన ప్రాజెక్టును సందర్శించాల్సిన గడ్కరీ పర్యటన వాయిదా పడింది.
పోలవరం ప్రాజెక్టుపై సవరించిన రూ. 58 వేలకోట్ల అంచనా ప్రతిపాదనలను ఆమోదించాల్సిందిగా చంద్రబాబు ఈ మధ్యనే కేంద్రాన్ని కోరారు. ఫైల్ ప్రస్తుతం గడ్కరీ వద్దే ఉంది. ఈ నేపధ్యంలోనే కేంద్రమంత్రి ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నారంటూ రాష్ట్రానికి సమాచారం అందింది.
సమాచారం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో మళ్ళీ కేంద్రమంత్రి కార్యాలయ అధికారులు మాట్లాడారు. కేంద్రమంత్రి వస్తే చంద్రబాబు వస్తారా? అంటూ వాకాబు చేశారు. సిఎం కూడా కేంద్రంమంత్రితో పాటు పరిశీలనకు వస్తారని రాష్ట్రంలోని ఉన్నతాధికారులు చెప్పారు.
వెంటనే కేంద్రమంత్రి కార్యాలయం నుండి మరో సమాచారం వచ్చింది. ఢిల్లీలో అదేరోజు మరో కార్యక్రమం ఉన్నందున కేంద్రమంత్రి పర్యటన వాయిదా పడిందంటూ చల్లగా చెప్పారు. దాంతో రాష్ట్ర ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. కేంద్రప్రభుత్వం-చంద్రబాబు మధ్య సంబంధాలు చెడిన కారణంగానే గడ్కరీ రావటం లేదా అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయ్.
.