నిజంగానే వీరు అంతటి భక్తులా?

Published : May 15, 2017, 05:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నిజంగానే వీరు అంతటి భక్తులా?

సారాంశం

ఏ పదవి ఆశించకుండా స్వచ్ఛందంగా రోజూ సేవలందిస్తున్న వారికన్నా ఎంపీలిద్దరూ గొప్ప భక్తులా? ఎంపిల దర్పం లేదా సెలబ్రిటీల హోదాతో వివిఐపి దర్శనాలు మాత్రమే చేసుకునే వీరిద్దరూ ఏనాడైనా సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారా? వీరిద్దరి వరుసా చూస్తుంటే వెంకన్న సేవ మీదకన్నా ఛైర్మన్ పదవి మీదే దృష్టి ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది.

తెలుగుదేశం ఎంపిల భక్తి దేనిమీదో అర్ధం కావటం లేదు. సంవత్సరాల తరబడి తమకు టిటిడి ఛైర్మన్ పదవి ఇవ్వండి బాబూ అని వేడుకుంటున్న తీరు చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి. టిడిపి తరపున నరసరావుపేట, రాజమండ్రిలో ఎంపిలుగా గెలిచిన రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్ వైఖరిపై ప్రస్తుతం పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

తిరుమల తిరుపతి దేవస్ధానం అంటే ప్రపంచంలో తెలియని వారుండరు. ఏడుకొండలపై కొలువున్న వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ ఫుల్లో అందరికీ తెలిసిందే. అటువంటి దేవస్ధానం నిర్వహణకు ట్రస్టు బోర్డు కూడా ఉంది. ట్రస్టు బోర్డన్నాక ఛైర్మన్, సభ్యులు తప్పదు కదా? ఆ ఛైర్మన్ పదవి కోసమే పోటీ పడుతున్నారు.

ట్రస్టుబోర్డుకు ఛైర్మన్ అవ్వాలన్నది రాయపాటి దశాబ్దాల కల. ఎప్పటి నుండో రాయపాటి ప్రయత్నాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాకపోతే  కొత్తగా పోటీకి వచ్చింది మురళీ మోహనే. మూడేళ్ళుగా ఎవరి స్ధాయిలో వారు గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు.  ఒకే పోస్టు కోసం పోటీ పడుతున్న ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటమే చంద్రబాబుకు ఇపుడు సమస్యగా మారింది.

ఇక, పోటీ పడుతున్న ఇద్దరూ చెబుతున్నది ఒకే మాట. వెంకటేశ్వరునికి సేవ చేసుకోవాలన్నది తమ చిరకాల కోరికని. ఎంత విచిత్రంగా ఉందో వారి మాట.  స్వామికి సేవ చేసుకోవాలంటే ఛైర్మన్ పదవి ఉంటేనే సాధ్యమా?  

నిజంగానే అంత భక్తి ఉన్న వారైతే ఏనాడైనా తిరుమలకు వెళ్ళి వాలంటీర్ గా ఒక్క రోజైనా సేవ చేసారా? ఏడాది పొడవునా స్వామి వారికి సేవ చేసుకోవటానికి అనేక సందర్భాలు వస్తుంటాయన్న విషయం వారికి తెలీదా? ఏ పదవి ఆశించకుండా స్వచ్ఛందంగా రోజూ సేవలందిస్తున్న వారికన్నా ఎంపీలిద్దరూ గొప్ప భక్తులా?

ఎంపిల దర్పం లేదా సెలబ్రిటీల హోదాతో వివిఐపి దర్శనాలు మాత్రమే చేసుకునే వీరిద్దరూ ఏనాడైనా సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారా? వీరిద్దరి వరుసా చూస్తుంటే వెంకన్న సేవ మీదకన్నా ఛైర్మన్ పదవి మీదే దృష్టి ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది.

ఎందుకంటే, టిటిడి ఛైర్మన్ హోదాలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రాచమర్యాదులుంటాయి. తలచుకుంటే చాలు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా వెంటనే దొరుకుతుంది. దేశంలోని అత్యంత ప్రముఖులు స్వామివారి దర్శనం కోసం తిరుమల వచ్చినపుడు వారి పక్కనుండి దర్శనం చేయిస్తే చాలు పదవిలో ఉన్నంత కాలం వారి తరపున ఛైర్మన్ కు రాజభోగాలే.

ఆ విషయాలు తెలిసిన వారు కాబట్టే ఛైర్మన్ పదవి కోసం అంతలా కొట్టుకుపోతున్నారు వారిద్దరు. అయితే, అపరభక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. టిటిడి ఛైర్మన్ పోస్టు కావాలనుకుంటే రాదు.  వెంకటేశ్వర స్వామి ఇవ్వాలనుకుంటేనే వస్తుంది.

 

 

PREV
click me!

Recommended Stories

YSRCP Leaders Protest at ABN Office: ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ నాయకులు| Asianet Telugu
MP Ambica G Lakshminarayana Speech: అనంతపూర్ ఎంపీ అంబికా పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu