కేంద్రంపై బాబు విమర్శలు
నెల్లూరు:కేంద్రం సహకరించకున్నా పోలవరం ప్రాజెక్టును 55 శాతం పూర్తి చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏడాది లోపుగా గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నీటిని అందించనున్నట్టు ఆయన చెప్పారు.నెల్లూరు జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన నవ నిర్మాణ దీక్షలో బాబు ప్రసంగించారు.
నాలుగేళ్ళుగా రాష్ట్రాభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్నట్టు బాబు చెప్పారు. కేంద్రం సహకరించకున్నా పోలవరం ప్రాజెక్టును 55 శాతం పూర్తి చేసినట్టు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 11 వ తేది నాటికి డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా లక్షా 20 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు.
అమరావతిని అభివృద్ది చేయడమే తన ముందున్న మరో లక్ష్యమని ఆయన చెప్పారు. అమరావతి నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నామని ఆయన చెప్పారు. ఏదైనా సాధించే దీక్ష, పట్టుదల తెలుగువారి స్వంతమని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసి కరువును తరిమికొడతామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.