ఎడతెరిపి లేకుండా వర్షం: పెన్నా మహోగ్రరూపం, అనంత జిల్లాలో ఆనకట్టల గేట్ల ఎత్తివేత

By Siva KodatiFirst Published Nov 28, 2021, 4:00 PM IST
Highlights

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అనంతపురం జిల్లాలో (anantpur district) పెన్నా నది (pennar river) మహోగ్రరూపం దాల్చింది. పెన్నా నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దాంతో జిల్లాలో పెన్నా నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలు, వరదల నుంచి కోలుకోకముందే.. మరోసారి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అనంతపురం జిల్లాలో (anantpur district) పెన్నా నది (pennar river) మహోగ్రరూపం దాల్చింది. పెన్నా నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దాంతో జిల్లాలో పెన్నా నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

వరద గేట్ల నుంచి నీటిని విడుదల చేయడం డ్యామ్ చరిత్రలో ఇదే తొలిసారి. అప్పర్ పెన్నా, మిడ్ పెన్నా, చాగల్లు రిజర్వాయర్ల గేట్లు కూడా ఎత్తివేశారు. అటు, కండలేరు జలాశయంలోనూ (kandaleru reservoir) నీటి మట్టం పెరుగుతుండడంతో తెలుగు గంగ కాలువ (telugu ganga canal) నుంచి నీటి విడుదలకు అధికారులు రెడీ అయ్యారు. స్వర్ణముఖి నదికి కూడా నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో తొట్టంబేడు మండలం రాంభట్లపల్లి గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) వానలు వదలడం లేదు. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. మొన్నటివరకు కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే.. మరోసారి వానలు దండికొడుతున్నాయి. ఈ నెల 29వ తేదీన అండమాన్ అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో నెల్లూరు (Nellore), చిత్తూరు (Chittoor) జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలు రాత్రి కురిసిన వర్షానికి తడిచి ముద్దయ్యాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

Also Read:Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు.. ఆందోళన చెందుతున్న ప్రజలు..

కాగా.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఆత్మకూరుతో పాటుగా ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకే వాగులు, వంకలు పొంగి ప్రవహించిన సంగతి  తెలిసిందే. తాజాగా మరోసారి వర్ష బీభత్సం నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

దక్షిణ అండమాన్‌ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం (low pressure area) ఏర్పడనుంది. ఇది తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర అల్పపీడనంగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో మరో 24 గంటలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ఏపీలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మొత్తంగా డిసెంబర్ 30 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 

click me!