
బాపట్ల : ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఓ వాలంటీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటి అరుగు మీద కూర్చున్న వివాహితను చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్ళ పోయాడు. అనుకోని ఈ ఘటనతో షాక్ అయిన ఆ వివాహిత ఒక్కసారిగా ప్రతిఘటించి కేకలు వేసింది. ఆమె అరుపులతో ఇరుగుపొరుగు వెంటనే అక్కడికి గుమిగూడడంతో వాలంటీర్ పారిపోయాడు. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి తిరిగి వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు.
ఈ దారుణమైన ఘటనకు సంబంధించి బాధితురాలు బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని బాప్టిస్ట్ పాలానికి చెందిన ఓ వివాహిత ఆదివారం ఇంటి ముందు కూర్చుని ఉంది. గాలిమోటు లోకకుమార్ అనే వాలంటీర్ ఆ సమయంలో ఆమె దగ్గరికి వచ్చాడు. వెంటనే ఆ వివాహితతో ‘నువ్వంటే నాకిష్టమ’ని చెప్పాడు. ఆ తర్వాత ఆమె చేయి పట్టుకుని, బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్ళేందుకు ప్రయత్నించాడు.
ఈ యాక్సిడెంట్ జరగడమే మంచిదయ్యింది... ప్రాణాలు కాపాడిన రోడ్డు ప్రమాదం
అనుకోని ఈ పరిణామానికి ఒకసారిగా షాక్ కు గురైన ఆమె.. వెంటనే చేయి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. గట్టిగా కేకలు వేసింది. ఆమె ప్రతిఘటనతో కోపానికి వచ్చిన వాలంటీర్.. ఆమెను గట్టిగా కాలితో తన్నాడు. ఎందుకు అరుస్తున్నావంటూ కొట్టాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ గలాటాకు చుట్టుపక్కల వారు అక్కడ పొగయ్యారు. వారిని చూసిన వాలంటీర్… ‘ నన్నెవరూ ఏం చేయలేరు.. మీ అంతు చూస్తా’ అంటూ వెళ్లిపోయాడు.
ఆ తర్వాత కాసేపటికి తన అనుచరులు, బంధువులతో కర్రలు తీసుకుని వచ్చాడు. వాలంటీర్ హెచ్చరికతో భయానికి గురైన బాధితులు అలర్ట్ గా ఉన్నారు. వాలంటీర్ మల్లోసారి దాడికి వస్తుండడంతో.. అతడి దాడి నుంచి తప్పించుకుని ఆమె బంధువులు… బాధితురాలిని ఆటోలో చెరుకుపల్లి తీసుకొచ్చారు.
అక్కడి నుంచి వారు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వాలంటీర్ ఘాతుకంపై ఫిర్యాదు చేశారు. నిరుడు కూడా ఈ వాలంటీర్ తనతో ఇలాగే ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు వాపోతున్నారు. సదరు వాలంటీర్ జనాల మీద దౌర్జన్యం చేసి.. తిరిగి వారి మీదే కేసులు పెడతాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేమని ప్రశ్నిస్తే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నాడంటూ బెదిరిస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది. వాలంటీర్ అతని బంధువులు అనుచరులతో తన బంధువులకు, తనకు ప్రాణహాని ఉందని ఆమె అన్నారు. లోక కుమార్ అనే వాలంటీర్ గ్రామంలో తనలాంటి వారి దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకుంటాడని.. తిరిగి డబ్బులు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తాడని మరియమ్మ అనే వార్డు సభ్యురాలు చెప్పుకొచ్చింది.
ఇక మరి కొంతమంది మహిళలు తాము కూడా వైసిపి వారిమేనని.. ఈ వాలంటీర్ల అరాచకాలు తట్టుకోలేక పోతున్నామని పోలీసుల దగ్గర వాపోతున్నారు. నెలనెలా పింఛను ఇచ్చే నేపంతో వాలంటీరు ఇళ్లకు వస్తాడని.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పుకొచ్చారు. అందుకే అతడిని తాము ఇండ్లలోకి రానివ్వడం లేదని వివరించారు.