
జగ్గయ్యపేట : ఓ కేసులో అనుమానితుడిని తీసుకువెళుతున్న సీఐ సొంత వాహనాన్ని గ్రామస్తులు ధ్వంసం చేసారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అవనిగండ్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల దాడిలో అనుమానితుడికి గాయాలవగా సీఐ కారు ధ్వంసమయ్యింది.
వివరాల్లోకి వెళితే... అవనిగండ్ల గ్రామ సర్పంచ్ జ్యోతి కుటుంబానికి చెందిన లారీని గతరాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు. నిప్పంటించడంతో లారీ క్యాబిన్ మొత్తం కాలిపోయింది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. గతంలో ఇలాగే సర్పంచ్ కుటుంబానికి చెందిన వరికోత యంత్రాన్ని కూడా దుండగులు ధ్వంసం చేసారు. ఇప్పుడు ఇలా లారీ ధ్వంసం చేయడంతో సర్పంచ్ జ్యోతి వర్గం సీరియస్ అయ్యింది. కొంతకాలంగా గ్రామంలో అలజడి సృష్టిస్తున్న బోశెట్టి త్రినాథ్ తో పాటు మరో ఇద్దరిపై సర్పంచ్ కుటుంబం, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేసారు.
తాజా లారీ దగ్దం ఘటనతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సమయంలో వారికి త్రినాథ్ దొరకడంతో దాడికి యత్నించారు. కానీ అప్పటికే లారీ దగ్దం గురించి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు... సీఐ తన సొంత కారులో అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు సీఐ సిద్దమయ్యారు. అతడిని కారులో ఎక్కించగానే ఒక్కసారిగా కర్రలతో కారుపై దాడిచేసారు గ్రామస్తులు. అద్దాలు ధ్వంసంచేసి త్రినాథ్ పై దాడిచేసారు. పోలీసులు చూస్తుండగానే సీఐ కారు ధ్వంసం, అనుమానితుడిపై దాడి జరిగింది.
గ్రామస్తుల దాడిలో అనుమానితుడు త్రినాథ్ తో పాటు ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఎలాగోలా త్రినాథ్ ను గ్రామం దాటించిన పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ పోలీసులు కూడా చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు.