దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణిలపై అనుమానంతో బాడీని స్కాన్ చేయగా ఒకరి కడుపు, మరొకరి మలద్వారంలో బంగారం వున్నట్లు తేలింది.
విజయవాడ: ప్రమాదకర రీతిలో మలద్వారం, కడుపులో బంగారాన్ని దాచుకుని విదేశాల నుండి భారత్ కు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడ్డారు. దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణిలపై అనుమానంతో బాడీని స్కాన్ చేయగా ఒకరి కడుపు, మరొకరి మలద్వారంలో బంగారం వున్నట్లు తేలింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన కాసీం అన్సారీ, కర్ణాటక కు చెందిన ఇంతియాజ్ అహ్మద్ దుబాయ్ నుండి గన్నవరం విమానాశ్రాయానికి వచ్చారు. అయితే వీరిద్దరి కదలికపై అనుమానం కలగడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఏమీ దొరకలేవు. అయినప్పటికి వారిని వదలకుండా బాడీ స్కాన్ చేయగా ఒక్కొక్కరి శరీరంలో దాదాపు 100నుండి 200గ్రాముల బంగారం వున్నట్లు గుర్తించారు.
దుబాయ్ నుండి బంగారాన్నిఅక్రమంగా ఇండియాకు చేర్చడానికి అక్రమార్కులు ప్రధానంగా హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఇటీవల కాలంగా ఇలా భారీగా స్మగర్లు పట్టుబడుతుండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో తాజాగా స్మగ్లర్లు ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయం ద్వారా ఈ బంగారం స్మగ్లింగ్ ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు కూడా అప్రమత్తమవడంతో తాజాగా ఇద్దరు పట్టుబడ్డారు.