
తిరుమలలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫొటో వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి స్పందించింది. శివాజీ ఫొటోను ఎవరూ అడ్డుకోలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కొందరు అత్యుత్సాహంతో టీటీడీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. భక్తులు పుకార్లను నమ్మవద్దని కోరారు. తిరుమలలో ఛత్రపతి శివాజీ బొమ్మపై ఎలాంటి నిషేధం లేదని ప్రకటించారు. ఇక, ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బోర్డు సభ్యుడు మిలిందా నర్వేకర్ శివాజీ విగ్రహాన్ని అందజేశారు. మిలిందా నర్వేకర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. వారం క్రితం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అత్యుత్సాహం కారణంగా అలిపిరి దగ్గర మహారాష్ట్ర భక్తుల వాహనంపై శివాజీ బొమ్మను తొలగించారు. కారులో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఉన్నందున తిరుపతిలోని చెక్పోస్టు వద్ద తనను అడ్డుకున్నారని మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. ఈ వీడియోలో.. బాలాజీ దర్శనం కోసం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తుండగా చెక్పోస్టు వద్ద తన కారు ఆగిందని.. ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని కారులో నుంచి తొలగించాలని సిబ్బంది కోరారని ఆరోపించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే వివరణ ఇచ్చింది. జూలై 23న ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్రీయులకు గర్వకారణమైన ఛత్రపతి శివాజీ మహరాజ్కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టీటీడీ ఖండించింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామగ్రి తిరుమలకు తీసుకువెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించిందని గుర్తుచేసింది.
‘‘ రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని అలిపిరి చెక్పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది నిలిపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది నల్లటి రంగులో ఉన్న ఒక ప్రతిమను గుర్తించారు. ఆ ప్రతిమ ఛత్రపతి శివాజీదని తెలుసుకుని తిరుమలకు అనుమతించారు. దేవతామూర్తుల చిత్రాలు తప్ప, వ్యక్తుల విగ్రహాలు, రాజకీయ పార్టీల జెండాలు, ఇతర చిహ్నాలను ప్రదర్శించరాదని సదరు భక్తుడిని కోరారు. అయితే ఆ భక్తుడు శివాజీ మహారాజ్ను టీటీడీ అవమానించిందని ఆరోపిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో రూపొందించి, ఇతరులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలోని విషయాలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తుంది’’ అని ప్రకటన పేర్కొంది.