
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. తెలుగు భాష పరిరక్షణ కోసం జై తెలుగు పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో జొన్నవిత్తుల మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, ప్రజలకు భాషా పట్ల సరైన అవగాహన కల్పించేందుకు ఉద్యమించడానికి రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు.
మహానీయుల స్పూర్తితో జై తెలుగు అనే పతాకాన్ని రూపకల్పన చేసినట్టుగా తెలిపారు. ఐదు రంగులతో ఆ పతాకం ఉంటుందని చెప్పారు. నీలం రంగు.. జలం, పచ్చ రంగు.. వ్యవసాయం, ఎరుపు రంగు.. శ్రమశక్తి, పసుపు.. వైభవానికి, తెలుపు.. స్వచ్ఛతకు చిహ్నంగా రూపొందించినట్లు చెప్పారు. తెలుగు భాష రథాన్ని, ప్రగతి రథాన్ని ప్రజలతో లాగించాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు.
తెలుగు భాష కోసం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రాలు తన జై తెలుగు రాజకీయ జెండాలో, ఎజెండాలో ఉంటాయని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పారు. తెలుగువాళ్లను నాడు మదరాసీలు అన్నారని.. నేడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామని.. కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని అన్నారు. ‘‘మన భాషను విస్మరించి.. మనమే చులకన చేసుకున్నాం’’ అని చెప్పారు. తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావాలన్నదే తమ సంకల్పం అని చెప్పారు.
ఇక, తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలిపారు. ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.