అనంతపురం: తల్లులు చూస్తుండగానే... చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు దుర్మరణం (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 12, 2021, 11:47 AM IST
Highlights

సరదాగా చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు లోతులోకి వెళ్ళి నీటమునిగి చనిపోయిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

అనంతపురం: చెరువులో సరదాగా ఈతకు దిగిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయిన మృత్యువాతపడ్డ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. తల్లులు బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లగా వారివెంట వెళ్లిన చిన్నారులు ఇలా ప్రమాదాన్ని కొనితెచ్చుకుని ప్రాణాలు కోల్పోయారు. 

వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తాండాకి చెందిన నాగరాజు-చిన్ని దంపతుల కుమారుడు లాలు ప్రసాద్ నాయక్. గోపినాయక్-శాంతమ్మ దంపతుల కుమారులు పురుషోత్తం నాయక్, హేమంత్ నాయక్. అయితే చిన్ని, శాంతమ్మ బట్టలు ఉతకడానికి సమీపంలోని చెరువుకు వెళ్లగా ఈ ముగ్గురు చిన్నారులు కూడా వారివెంట వెళ్లారు. అయితే తల్లులు బట్టలు ఉతుకుతుండగా ఈ ముగ్గురు సరదాగా చెరువులోకి దిగారు. 

వీడియో

ఇలా నీటిలోకి దిగిన పిల్లలు ఆడుకుంటూ మెళ్లిగా లోతులోకి వెళ్లిపోయారు. దీంతో నీటమునిగి కొట్టుకుంటున్న వీరిని కాపాడేందుకు తల్లులు ప్రయత్నించే లోపే గల్లంతయ్యారు. దీంతో ఇద్దరు తల్లులు చుట్టుపక్కల వారిని పిలిచి వెతికించినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్తులంతా దాదాపు నాలుగుగంటలు వెతకగా ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.  

read more  గుంటూరు జిల్లాలో యువకుడి హత్య: ప్రేమ వ్యవహరమే కారణమా?

ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పట్టుకుని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. ఒకేసారి ముగ్గురు చిన్నారులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతిపై దర్యాప్తు చేపట్టారు.
 

click me!