జగన్ రాజధానిమార్పుపై పోరు: చంద్రబాబు వెనక్కి, పవన్ ముందుకు...

By telugu teamFirst Published Jan 21, 2020, 1:56 PM IST
Highlights

సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబును వెనక్కి నెట్టి, పవన్ కల్యాణ్ ముందుకు వచ్చేలా చూస్తోంది. అమరావతి రైతుల తరఫున పవన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పోరుకు బిజెపి చక్రం తిప్పుతున్నట్లే కనిపిస్తోంది. అమరావతి రైతుల ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని వెనక్కి నెట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపుతోంది.

అమరావతి రైతుల తరఫున కేంద్రం వద్దకు పవన్ కల్యాణ్ రాయబారిగా ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు బుధవారం ఆయన ఢిల్లీ వెళ్తారని సమాచారం. మంగళవారంనాడు పవన్ కల్యాణ్ అమరావతి రైతులతో భేటీ అయ్యారు. తన పార్టీ కార్యాలయానికి వచ్చిన అమరావతి రైతులను ఆయన పరామర్శించారు. 

వైఎస్ జగన్ రాజధాని మార్పును వెనక్కి తీసుకునేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని అమరావతి రైతులు కోరుతున్నారు. ఆ విషయాన్ని కేంద్రానికి నివేదించాలని వారు పవన్ కల్యాణ్ ను కోరుతున్నారు. దాంతో ఆయన రేపు ఢిల్లీకి పయనమవుతున్నారు. 

Also Read: జగన్ కు పెద్ద గండమే: రంగంలోకి పవన్, కేంద్రంతో రాయబారం

సోమవారంనాడు సాయంత్రం అమరావతి రైతులను పరామర్శించడదానికి వెళ్లేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన పార్టీ కార్యాలయానికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం రైతులే పవన్ కల్యాణ్ వద్దకు వచ్చారు. 

బిజెపితో జనసేన పొత్తు పెట్టుకోవడం వైఎస్ జగన్ కు తలనొప్పిని తెచ్చిపెట్టినట్లే భావించాల్సి ఉంటుంది. కేవలం ఎన్నికల కోసమే కాకుండా జగన్ ను కౌంటర్ చేయడానికి అవసరమైన చర్యలకు పవన్ కల్యాణ్ దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తన్నారు. 

Also Read: భూదందాల కోసమే: వైఎస్ జగన్ మూడు రాజధానులపై జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు

తాజాగా ఆయన మరో మాట కూడా అన్నారు. రాజధాని ఎక్కడికీ పోదని, అమరావతిలోనే ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చిన భరోసాతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే జగన్ దాన్ని ఎలా ఎదుర్కుంటారనేది ప్రశ్నార్థకమే. 

click me!