చంద్రబాబుపై జేసీ తిరుగుబాటుకి అసలు కారణం ఇదేనా..?

First Published Jul 19, 2018, 12:38 PM IST
Highlights

తాను వచ్చే ఎన్నికల్లో న్యూట్రల్ గా ఉంటూ.. కొడుకు ద్వారా చక్రం తిప్పాలని చూస్తున్నాడనే వాదనలు వినపడుతున్నాయి.

మాజీ మంత్రి, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనూహ్యంగా చంద్రబాబుపై తిరుగుబాటు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీలోపుగా తన డిమాండ్లు నెరవేర్చకపోతే పార్టీకి రాజీనామా చేయనున్నట్టు  ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.   పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. 

అయితే.. ఈ తిరుగుబాటు వెనుక జేసీ పెద్ద పథకమే రచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి అడుగుపెట్టిన జేసీకి.. మొదటి నుంచి కొంతమంది టీడీపీ నేతలతో సయోధ్య కుదరలేదనే చెప్పాలి. రెడ్డి, కమ్మ వర్గాలు విడిపోయి ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేయనని జేసీ ఎప్పుడో ప్రకటించారు.

ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి.. తన వారసత్వంగా తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని దించాలని అనుకుంటున్నాడు. అయితే.. జేసీ కుమారుడికి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఒకవైపు జేసీ ని తమ పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ అధినేత జగన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

అయితే.. తనకన్నా వయసులో చిన్నవాడైన జగన్ ని సర్ అని పిలవడం ఇష్టం లేని జేసి.. ఆ ఆఫర్ ని ఉపయోగించుకులేదు. కాగా.. ఇప్పుడు తన కుమారుడు పవన్ ని వైసీపీలో చేర్పించుందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. తాను వచ్చే ఎన్నికల్లో న్యూట్రల్ గా ఉంటూ.. కొడుకు ద్వారా చక్రం తిప్పాలని చూస్తున్నాడనే వాదనలు వినపడుతున్నాయి.

అందుకోసమే.. చంద్రబాబుపై అలక చేపట్టాడని.. తిరుగుబాటు ప్రకటించి డిమాండ్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
 

click me!