మార్చురీలో మహిళ మృతదేహం.. తన భార్యదేనంటూ అంత్యక్రియలు, ఆటోలో ఇంటికొచ్చిన సతీమణి

By Siva KodatiFirst Published Jun 2, 2021, 6:25 PM IST
Highlights

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. నిర్లక్ష్యంగా చికిత్స, అధిక ఫీజులు, మృతదేహాల విషయంలో గందరగోళం ఇలా ప్రతిచోటా ఇవే కనిపించే దృశ్యాలు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. నిర్లక్ష్యంగా చికిత్స, అధిక ఫీజులు, మృతదేహాల విషయంలో గందరగోళం ఇలా ప్రతిచోటా ఇవే కనిపించే దృశ్యాలు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. జగ్గయ్యపేటలో చనిపోయిందనుకున్న మహిళ తిరిగి రావడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని క్రిస్టియన్‌ పేటలో నివసిస్తున్న ముత్యాల గిరిజమ్మ (75)కు కరోనా సోకడంతో మే 12న చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. మధ్యలో గిరిజమ్మ భర్త గడ్డయ్య ఆసుపత్రికి వెళ్లి కావాల్సిన వస్తువులు అందజేసి వచ్చాడు. ఈ నేపథ్యంలో 15న మరోసారి ఆసుపత్రికి వెళ్లి చూడగా బెడ్‌పై గిరిజమ్మ కనిపించలేదు. కంగారుపడిన గిడ్డయ్య.. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. వేరే వార్డుకు మార్చారేమో చూసుకోమని పంపేశారు. అన్ని వార్డులూ వెతికిచూసినా ఎక్కడా కనిపించకపోవడంతో  తిరిగి సిబ్బందిని అడగ్గా.. ఒకసారిలో మార్చురీలో కూడా చూడాలని బదులిచ్చారు.

Also Read:ఏపీలో కరోనా తగ్గుముఖం: మరణాల్లో జోరు.. ప.గోకు ఊరట, చిత్తూరులో భయానకం

అయితే మార్చురీలో పొరపాటున గిరిజమ్మను పోలి ఉన్న వేరే మహిళ మృతదేహాన్ని చూసి తన భార్యేనని గడ్డయ్య భావించాడు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించిన ఆయనకు ఆసుపత్రి సిబ్బంది డెత్‌ సర్టిఫికెట్‌ కూడా జారీ చేశారు. అనంతరం మృతదేహాన్ని జగ్గయ్యపేట తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఇదే సమయంలో గిరిజమ్మ కుమారుడు రమేష్‌ కూడా కరోనాతో గత నెల 23న మృతి చెందాడు. దీంతో ఇద్దరికీ కలిపి నిన్న పెద్దకర్మ నిర్వహించారు. ఈ నేపథ్యంలో గిరిజమ్మ ఆసుపత్రిలో కరోనా నుంచి కోలుకుంది. తనను చూడడానికి ఎవరూ రాకపోవడంతో ఆమె స్వయంగా బుధవారం ఉదయం ఆటోలో ఇంటికి చేరుకుంది. చనిపోయిందనుకున్న గిరిజమ్మను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. 

click me!